Gaddar: ప్రజా యుద్ధ నౌక, వాగ్గేయకారుడు గద్దర్ మరణించి ఏడాది గడుస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో గద్దర్ తనయుడు సూర్యం మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గద్దర జీవన పోరాటానికి చిహ్నంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. గద్దర్ జీవితాశయానికి ఈ ఫౌండేషన్ ఒక వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘మా నాన్న ప్రతి పోరాటంలో పాట ఉంది, మాట ఉంది, పోరాటం ఉంది, త్యాగం ఉంది. భారత పీడిత వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలు, అందుకు తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పవి. ఆయన తరుచూ తాను ఆచరించిన నిబద్ధత గురించి గొప్పగా చెప్పుకునేవారు. ‘నేను గీత తప్పలేదు బిడ్డా. నేను నా గీత మీదే నడుస్తున్నాను’ అని ప్రతి అంశంలో ఈ విషయాన్ని గొప్పగా చెప్పేవారు. విప్లవాన్ని రక్షించుకోవడం కోసం ఆయన జీవితాన్ని ధారపోశారు. భారత దేశ చరిత్రలో నింగికెగసిన కెరటం గదరన్న. యావత్ తెలంగాణే కాదు.. దేశమంతా ఆ కెరటాన్ని స్మరించుకుంటున్నది’ అని సూర్యం వివరించారు.
అల్లం నారాయణ ఈ సభలో మాట్లాడుతూ.. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగు దళి వర్గానికి చెందిన గద్దర్.. విప్లవపార్టీకి నెత్తురు ధారపోశారని గుర్తు చేశారు. నక్సల్బరీ ఉద్యమంలో నలభై ఏళ్లు తన జీవితాన్ని కొనసాగించారని, నక్సల్బరీ ఉద్యమం నుంచి శ్రీకాకుళం పోరాటాల వరకు తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను ఆయన వేసుకున్నారని వివరించారు. గద్దరపై వెకిలి రాతలు, వెక్కిరింతలు అనేకం ఉన్నాయని, కానీ, ఉద్యమం నుంచి గద్దర్ బయటికి వచ్చిన తర్వాత కూడా అదే స్ఫూర్తితో కొనసాగారని తెలిపారు. గద్దర్ లేకుండా తెలంగాణ రాలేదని, ఇది గద్దర్ తెచ్చిన తెలంగాణ అని స్పష్టం చేశారు. రివిజనిజాన్ని బద్దలు కొట్టిన చారుమజుందార్ నక్సల్బరీ ధార వెంట నడిచిన ఘనుడు గద్దరన్న అని వివరించారు. అట్టడుగు బలహీన వర్గాల బతుకుల కోసం పోరాడి అమరుడైన గద్దర్ ఘన నివాళి ప్రకటించారు.
Also Read: బీఆర్ఎస్ గుట్టురట్టు.. కవిత కేసుపై క్లారిటీ, ఢిల్లీ టూర్ అందుకేనా?
ఈ సభకు హరగోపాల్, అదె శ్రీ, గోరటి వెంకన్న, నందిని సిధారెడ్డి, కంచె ఐలయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. అరుణోదయ, ప్రజాకళా మండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విప్లవ, సాంస్కృతిక గేయాలతో యుద్ధ నౌకకు ప్రజా సంఘాలు ఘనంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాయి.