Bangladesh Parliament Suspended: బంగ్లాదేశ్ లో మైనార్టీల రిజర్వేషన్లు రాజకీయ సంక్షోభాన్ని తీసుకొచ్చాయి. రెండ్రోజులుగా అక్కడ నిరసనకారుల అల్లర్లు పెరిగి.. మాజీ ప్రధాని హసీనా ఇంటికి చేరుకున్నాయి. నెట్టింట ఆ దృశ్యాలన్నీ వైరల్ అయ్యాయి. దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ప్రెసిడెంట్ అక్కడి పార్లమెంట్ ను రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జైలు నుంచి రిలీజయ్యారు.
అయితే.. కొత్త ప్రభుత్వానికి ముఖ్యసలహాదారుడిగా మహమ్మద్ యూనస్ ను నియమించాలని విద్యార్థి సంఘాలు ప్రతిపాదన తెచ్చాయి. తమ ఆమోదం లేకుండా ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరంటూ.. ఈ ఉద్యమానికి ప్రధాన కారణమైన 26 సంవత్సరాల నహిద్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల ఉద్యమం పెచ్చరిల్లి.. ప్రధాని బంగ్లాలోకి చొరబడే వరకూ రావడం వెనుక ఎవరున్నారు అంటే.. అక్కడ వినిపిస్తున్న పేరు నహిద్ ఇస్లామ్. ఇతను ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ చదువుతున్న 26 ఏళ్ల విద్యార్థి. చిన్న ఆందోళనగా మొదలైన ఉద్యమం.. గాలివానగా మారి ప్రభుత్వాన్ని కూల్చివేసింది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేసిన ప్రతిసారి తమ దేశ జెండా నుదిటికి కట్టుకుని కనిపించేవాడు.
ఈ ఏడాది జులైలో నహిద్ కొందరు విద్యార్థులతో కలిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఆందోళనే ప్రజల దృష్టిని ఆకర్షించి.. ఉద్యమంగా మారింది. చాలా ఘర్షణలు జరగ్గా.. 300 మంది విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఫలితంగా షేక్ హసీనా పదవికి రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా చేసి వెంటనే భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. యూకే నుంచి పర్మిషన్ రాగానే ఆమె లండన్ కు వెళ్లిపోనున్నారు.