ఆదాయం తగ్గిపోవడం, ఆర్థిక మాంద్యం భయపెడుతుండటంతో… పూటకో కంపెనీ ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా సహా ఎన్నో కంపెనీలు వేల మంది ఉద్యోగుల్ని తీసేశాయి. ఇప్పుడీ జాబితాలో అడోబ్, స్విగ్గీ, వేదాంతు కూడా చేరాయి. తాజాగా ఈ మూడు సంస్థలు దాదాపు 750 మంది ఉద్యోగుల్ని తొలగించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ… ఈ నెలలో 250 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అంతేకాదు… వచ్చే కొన్ని నెలల్లో స్విగ్గీ ఫుడ్ గ్రాసరీకి చెందిన వందల మంది ఉద్యోగులపై వేటు పడొచ్చని చెబుతున్నారు. పనితీరు ఆధారంగా ఉద్యోగుల్ని ఉంచాలా? తొలగించాలా? అనే అంశంపై స్విగ్గీ యాజమాన్యం ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. సంస్థకు అనుగుణంగా విధులు నిర్వర్తించలేని ఉద్యోగుల్ని మాత్రం తొలగిస్తున్నట్లు… ఇప్పటికే వారికి స్విగ్గీ సమాచారం అందించింది. ఖర్చుల్ని ఆదా చేసేందుకు తన ఇన్స్టామార్ట్ ఉద్యోగుల్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించనుంది… స్విగ్గీ.
ఇక ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు కూడా 385 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. కంపెనీ తన వర్క్ ఫోర్స్ను 11.6 శాతం తగ్గించినట్లు వెల్లడించింది. నిధుల కొరత కారణంగా వేదాంతు ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 1100 మందికి పింక్ స్లిప్ జారీ చేసింది. ప్రస్తుతం వేదాంతులో 3,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇక అడోబ్ కూడా… పొదుపు చర్యల్లో భాగంగా సేల్స్ విభాగంలో 100 మందిని తొలగించనున్నట్లు సమాచారం. కొందరు ఉద్యోగుల్ని వివిధ విభాగాలకు మార్చడంతో పాటు… కచ్చితంగా అవసరం ఉన్న విభాగాల్లో ఉద్యోగుల్ని నియమించకోవడం, అవసరానికి మించి ఉన్న వారిని తొలగించడం చేస్తోంది… అడోబ్. మొత్తమ్మీద బడా కంపెనీల నుంచి చిన్న సంస్థల దాకా… అన్నీ సిబ్బందిని తొలగిస్తూ ఉండటంతో… ఎప్పుడు జాబ్ ఊడుతుందోనని టెన్షన్ పడుతున్నారు… ప్రైవేట్ ఉద్యోగులు.