Foreign Ministry: యూఎస్, యూకేలకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడికి మన దేశం నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన, మంచి వేతనంతో ఉపాధి లభించే దేశాల్లో యూకే కూడా ఒకటి. ఈ దేశంలో నేరాలు, అల్లర్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. కానీ, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా శరణార్థులు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు వచ్చాయని కొందరు చెబుతున్నారు. వాస్తవం ఏదైనా.. ఇంగ్లాండ్లో కూడా ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి. హింస పెచ్చరిల్లుతున్నది. దీంతో స్థానికులే కాదు.. విదేశాల నుంచి వలస వచ్చినవారిలోనూ వణుకు పుడుతున్నది.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా ఈ అల్లర్లకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి లండన్ కాదు ఇది అంటూ పలువురు వాపోయారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం యూకేకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యూకేలో జరుగుతున్న అల్లర్లు, హింస నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచనలు చేసింది.
Also Read: కొడుకును చదివించి సీఐ చేస్తే.. చివరికి తల్లిదండ్రులనే..!
లండన్లోని భారత హైకమీషనర్ జారీ చేసిన అడ్వైజరీలో ఇలా ఉన్నది. యూకేలో జరిగిన కొన్ని అలర్లు, అలజడిపై అవగాహన కలిగి ఉండాలని భారత ట్రావెలర్స్కు సూచించింది. ఈ పరిస్థితులను లండన్లోని భారత హైకమీషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నదని పేర్కొంది. యూకేకు వచ్చే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక మీడియా చానెళ్లు ఫాలో అవుతూ స్థానిక భద్రతా ఏజెన్సీలు జారీ చేసే జాగ్రత్తలు, సూచనలు తెలుసుకుని ఫాలో కావాలని పేర్కొంది. ఇంకా నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే భారత హైకమిషన్ను సంప్రదించాలని సూచించింది. ఆల్డ్విచ్లోని ఇండియా హౌజ్ను సంప్రదించాలని వివరించింది. అలాగే.. ఏ హెల్ప్లైన్ నెంబర్ను కూడా హైకమిషన్ ఏర్పాటు చేసింది. యూకేకు వచ్చే వారు ఇక్కడి పరిస్థితులను అవగహన చేసుకుని రావాలని సూచించింది.
దుష్ప్రచారమే కారణమా?
అగ్రరాజ్యాల స్వార్థపూరిత ప్రయోజనాలతోనే మద్యప్రాశ్చ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయనేది కొందరు విశ్లేషకుల మాట. ఈ యుద్ధాల కారణంగా బతుకు జీవుడా అంటూ పొట్టచేతపట్టుకుని ఆ దేశాల నుంచి బయటికి వచ్చే శరణార్థుల బాధ్యత ఎవరు తీసుకోవాలి? పొరుగున ఉన్న దేశాలు వారిని స్వీకరించాలని, ఇతర దేశాలు కూడా శరణార్థులను వెళ్లగొట్టవద్దని అంతర్జాతీయ సంస్థలు సూచనలు చేశాయి. యూకే కూడా శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. ఇప్పటికీ చాలా మంది యుద్ధ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చినవారిని రిఫ్యూజీ క్యాంప్లలో సేఫ్గా చూసుకుంటున్నది. పైన చెప్పిన యుద్ధాలు ఎక్కువగా ముస్లిం దేశాల్లో జరిగాయి, జరుగుతున్నాయి. దీంతో సహజంగా శరణార్థుల్లో వారి సంఖ్యే ఎక్కువ. ఇప్పుడు యూకే శరణార్థి ఆశ్రయాల్లోనూ ముస్లింలు ఎక్కువే ఉన్నారు.
వీరిని బూచీగా చూపి కొందరు అతివాద జాతీయవాదులు గందరగోళం, ఆందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇజ్రాయెల్కు మద్దతునిచ్చే జియోనిస్టులు వంతపాడారు. ఇటీవలే జరిగిన ఓ వికృతమైన నేరానికి శరణార్థులే కారణమనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఫార్ రైట్ వింగ్ యాక్టివిస్టులు వారిపై విషం చిమ్మారు. రోడ్డెక్కారు. శరణార్థులు కూడా నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలోనే యూకేలో ఆందోళనలు హింసాత్మకం అయ్యాయి. అవి కాస్త అల్లర్లుగా మారిపోయాయి. ఇప్పుడు అక్కడ ప్రజలు నిలువునా చీలుతున్నారు. అయితే.. శరణార్థులను తీవ్రంగా ద్వేషించాలి, లేదంటే స్వీకరించాలి అనే రెండు కోవలుగా మారిపోతున్నారు. దీనిపై స్థానిక విద్యావంతులు, మేధావుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.