United AP: ఏపీ, తెలంగాణ. రెండు తెలుగు రాష్ట్రాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కలిసిపోయి 8 ఏళ్లు అవుతోంది. సడెన్ గా ఇప్పుడు మళ్లీ యునైటెడ్ ఏపీ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? వచ్చింది అనడంకంటే తెచ్చారు అనడం కరెక్ట్. సజ్జల అంతటి స్థాయి ఉన్నవారే.. అవసరమైతే తిరిగి రెండు రాష్ట్రాలను కలపాలని డిమాండ్ చేయడం అమాయకత్వమా? వ్యూహాత్మకమా? విభజన చట్టం అసంబద్ధమని.. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేయడం వెనుక అసలు ఉద్దేశమేంటి?
రెండు రాష్ట్రాలను మళ్లీ కలపాలని సజ్జల అనగానే.. రాజకీయ రియాక్షన్లు వయటెంట్ గా వస్తున్నాయి. టీఆర్ఎస్ వాళ్లకంటే కూడా ఏపీ, తెలంగాణలకు చెందిన బీజేపీ నేతలు వేగంగా రియాక్ట్ అవడమే ఆసక్తికరం. ఏపీ బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి.. ఢిల్లీ నుంచి స్పందించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. సజ్జలపై మండిపడ్డారు. ఇక, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ఇదంతా వైసీపీ, టీఆర్ఎస్ ల డ్రామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేంటి? టీఆర్ఎస్ నేతలకంటే ముందుగానే బీజేపీ ఎందుకు యాక్టివ్ అయింది? ఇక్కడ టీఆర్ఎస్ కు కానీ, అక్కడ వైసీపీకి కానీ.. అడ్వాంటేజ్ అవకుండా అడ్డుకోవడానికే కమలనాథులు సజ్జలపై కస్సుమంటున్నారా? విభజన అంశాన్ని ఎంతగా రాజేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు అంత అనుకూలం. సెంటిమెంట్ను ఓట్లుగా మార్చుకునే సత్తా కేసీఆర్ కు ఉంది. అందుకే, బీజేపీ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారని అంటున్నారు. రెండు రాష్ట్రాలను మళ్లీ కలపడం అసాధ్యమని.. గతంలో విడిపోయిన ఏపీని తమిళనాడులో కలిపేస్తారా? అంటూ ఎంపీ అర్వింద్ ప్రశ్నించడం అందులో భాగమేనని తెలుస్తోంది. మరోవైపు, సజ్జల చేసిన కామెంట్లపై ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్పందించకపోవడం కుట్రలో భాగమేనన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అసాధ్యమనే సంగతి.. సజ్జల లాంటి నేతకు తెలీదా? మరెందుకు ఇప్పుడు రాష్ట్రాలను కలపాలనే టాపిక్ ను రైజ్ చేసినట్టు? ఆ మాట అంటూనే వైసీపీ పార్టీ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ విభజనను సమర్ధించాయని గుర్తు చేయడం చూస్తుంటే ఆయన వ్యూహమేంటో ఈజీగా అర్థమైపోతుందని అంటున్నారు. ఒకవేళ మళ్లీ ఉమ్మడి ఏపీ డిమాండ్ రాజుకుంటే.. వైసీపీ మాత్రమే సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కు కట్టుబడి ఉన్న రాష్ట్రమని.. టీడీపీ, బీజేపీలు విభజనకు సపోర్ట్ చేసాయంటూ వాటిని బూచీగా చూపించే ప్రయత్నం జరగొచ్చని చెబుతున్నారు.
ఏపీ, తెలంగాణలో అధికార పార్టీ విజయావకాశాలు కత్తి మీద సాముగా మారాయి. రెండు ప్రభుత్వాలు ఎంతగా పథకాలు ప్రవేశపెడుతున్నా.. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్షాలు బలపడటం వైసీపీ, టీఆర్ఎస్ లను టెన్షన్ పెడుతోందని అంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేనల పొత్తు పొడిచే అవకాశం ఉండటం వైసీపీని కలవర పెడుతోంది. తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకోవడం, రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ కోలుకుంటుండటంతో.. గులాబీ దళంలోనూ గడిబిడి. ఇలా, రెండు రాష్ట్రాల్లోనూ అధికార పక్షానికి దాదాపు ఒకేవిధమైన పరిస్థితి. దీనికి చెక్ పెట్టడానికే.. రహస్య స్నేహితులైన కేసీఆర్, జగన్ లు మళ్లీ పాతగాయాన్ని కొత్తగా రేపుతున్నారని అనుమానిస్తున్నారు. ఇటు తెలంగాణ మంత్రులతో వైఎస్ ఫ్యామిలీని తిట్టించడం.. అటు సజ్జల లాంటి కీలక నేత మళ్లీ రెండు రాష్ట్రాలను కలపాలంటూ మాట్లాడటం చూస్తుంటే.. రాజకీయంగా ఏదో జరుగుతోందని అంటున్నారు. మళ్లీ అలనాటి సెంటిమెంట్ ను రగిలిస్తున్నారా? ఆ మంటల్లో రాజకీయ చలి కాచుకోవాలని చూస్తున్నారా? ఈ టైమ్ లో.. ఆ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా? ఏదో ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నారా? చూడాలి ముందుముందు ఏం జరుగుతుందో…