Lawyers Protest: రాజన్న సిరిసిల్లలో న్యాయవాదులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ విధులనూ బహిష్కరించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఉత్తర్వులు ఉన్నా పోలీసులు జోక్యం చేసుకోవడంపై అభ్యంతరం చెబుతున్నారు. కక్షిదారులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కోర్టులు వెలువరించే ఉత్తర్వులను సిరిసిల్ల పోలీసులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు.
ఐదు రోజులుగా సిరిసిల్ల న్యాయవాదులు నిరసనలు చేస్తున్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణం ప్రెస్క్లబ్లో సిరిసిల్ల బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దోర్నాల సంజీవ్ రెడ్డి, అడ్వకేట్ రమాకాంత్ సహా పలువురు తమ అభ్యంతరాలను మీడియాకు ఏకరువు పెట్టారు.
Also Read: స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
సివిల్ కేసుల్లో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు కక్షిదారులపైనే కేసులు పెడుతున్నారని, కోర్టులు వెలువరిస్తున్న ఆర్డర్లను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. 5 రోజులుగా కోర్టు విధులు బహిష్కరిస్తున్నా పోలీసు శాఖలో కదలిక లేదని పేర్కొన్నారు. న్యాయ స్థానాల ఆదేశాలను పోలీసులు లెక్క చేయడం లేదన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లితే తమకు సమయం కేటాయించలేదని ఆరోపించారు. ప్రజల న్యాయ హక్కులను సంరక్షించడానికి పాటుపడే న్యాయవాదులు రోడ్డెక్కినా పోలీసులు స్పందించకపోవడం బాధాకారం అని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులు వారి హక్కులను భక్షించడం తగదని హితవు పలికారు. ప్రజల పక్షాన పోరాడటానికి న్యాయవాదులు ఎల్లప్పుడూ ముందుంటారని దోర్నాల సంజీవ రెడ్డి, రమాకాంత్లు చెప్పారు.