Pawan Kalyan: వైసీపీ అధినేత జగన్పై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో బలోపేతమైన అన్ని వ్యవస్థలు ఆటబొమ్మలుగా మారాయని అన్నారు. సోమవారం ఏపీ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలను ఎదుర్కున్నామన్న ఆయన.. వ్యవస్థలను అన్నింటినీ నిలబెట్టాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకుని నిలబడ్డామని తెలిపారు.
పాలన అంటే ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసిందని అన్నారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం అని అన్నారు. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అంతే కాకుండా పైలెట్ ప్రాజెక్టుగా మొదట పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని అన్నారు. జిల్లా కలెక్టర్లంతా పూర్తి స్థాయిలో ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2014- 19 మధ్యకాలంలో దాదాపు పదివేల గ్రామపంచాయతిల్లో ప్రారంభించిన ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
నియోజకవర్గంలో గ్రే వాటర్ మేనేజ్మెంట్ విధానం ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అధునాతన పద్ధతిలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఇతర పథకాల కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను ఓడీఎఫ్ ప్లస్ కింద నిర్వహిస్తామని అన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి గృహానికి సురక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ఈ నెల 15 నుంచి పల్స్ సర్వే నిర్వహించనున్నామని అన్నారు. ఈ ఏడాది గ్రామ పంచాయతీలో 5 లక్షల 40 వేల కనెక్షన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. దీనావస్థలో ఉన్న గ్రామీణ మరుగు రోడ్ల పరిస్థితి మెరుగు పరచడంతో పాటు దాదాపు 4,729 కిలోమీటర్ల మేర నూతన రోడ్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
Also Read: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందా?.. మంత్రి క్లారిటీ
రాష్ట్రంలో 37,431 చదరపు కిలోమీటర్ల నోటిఫైడ్ అటవీ ప్రాంతం ఉందని ఆ ప్రాంతానికి బయట 10,227 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ప్రాంతంతో పాటు చెరువులు, కొండ ప్రాంతాల్లో పంచాయతీ భూములు, పలు సంస్థల్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో అటవీ ప్రాంతం చాలా తక్కువగా ఉందని ఆయా ప్రాంతాల్లో అటవీ ప్రాంతం విస్తరించేందుకు వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ఆ ప్రాంతాలను రక్షించడం, ఆక్రమణలు తొలగించడం తదితర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.