Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ కొంతకాలంగా బంగ్లాదేశ్ లో నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ నిరసన ఘటనల్లో వందలాది మంది మృతి చెందారు.
రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్లో గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాని రాజీనామా చేయాలంటూ నిరసన కారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఈ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ నిరసనల్లో 300 లకు పైగా మరణించారు. మరో వైపు బంగ్లా దేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది.
ప్రధాని షేక్ హసీనా ఢాకా నుంచి ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆమెను మిలటరీ హెలికాప్టర్లో సైన్యం సేఫ్ ప్లేస్కు తరలించింది. అయితే హసీనా.. భారత్కు వెళ్తున్నారంటూ అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్లో అల్లర్లు తీవ్రం కావడంతో రంగంలోకి ఆర్మీ దిగింది. హసీనాను రాజీనామా చేయాలని ఆర్మీ కోరినట్టు తెలుస్తోంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో హసీనా ఢాకా నుంచి వెళ్లిపోయారు. మరోవైపు బంగ్లా ఆర్మీ చీఫ్ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
బంగ్లాదేశ్లో హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఢాకా రోడ్లపై భారీగా ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు తెలుపుతున్నారు. సీనా ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల అంశం అగ్గిని రాజేసింది. ఇప్పుడది దావానంలా వ్యాపించి బంగ్లాదేశ్ను మండిస్తోంది. ముఖ్యంగా, విద్యార్థుల కేంద్రంగా నడుస్తున్న నిరసన కావడంతో అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. మిలటరీ, కర్ఫ్యూ లాంటి ప్రభుత్వ చర్యలేవీ పనిచేయట్లేదు. ఈ హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకు 300 మందికిపైగా మరణించారు అంటేనే ఏ స్థాయిలో బంగ్లాదేశ్ ఉడికిపోతుందో అర్థమవుతుంది.
చాలా ప్రాంతాల్లో నిరసనకారులు ప్రైవేట్ ఆస్తులకు నిప్పుపెట్టి, ధ్వంసం చేస్తున్నారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇచ్చే 30 శాతం కోటాను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. పలు వర్సిటీల విద్యార్థులతో పాటు ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ రిజర్వేషన్ పద్ధతిని తక్షణమే రద్దు చేసి, అర్హులైన మెరిట్ అభ్యర్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.