KTR Warning to Party leaders(Political news in telangana): తెలంగాణలో తాజా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో వలసలు కడుతుండగా..మరో పక్క స్పీకర్ మరికొందరు బీఆర్ఎస్ నేతలపై సభాహక్కుల నియమాలను అతిక్రమించారని వారిపై అనర్హత వేటు వేయనున్నారని వార్తలుు వస్తున్న వేళ కమాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరింత మందిని కాంగ్రెస్ లో లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలను వాళ్లకున్న పరిచయాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒప్పించి పార్టీ మార్పించే యత్నాలు చేయవలసిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఇక టార్గెట్ బీఆర్ఎస్ అనే రీతిలో కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నారు. అవసరమైతే వాళ్లకు నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు.
భయాందోళనలో ఫిరాయింపు నేతలు
ఇలాంటి పరిస్థితిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీ పిరాయించిన నేతలు హడలిపోతున్నారు. తాను న్యాయనిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్నాకే బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం కింద వారిపై కేసులు పెడతామని కేటీఆర్ బెదిరిస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులతో ఎమ్మెల్యే పదవులు కోల్పోయేవారితో మళ్లీ ఎన్నికలు జరగక తప్పవని..అప్పుడు ప్రజాక్షేత్రంలో పార్టీ ఫిరాయించిన వారికి ప్రజలే తమ ఓట్లతో బుద్ధిచెబుతారని..ఆ రోజు మరెంత కాలమో లేదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ములాఖత్ అని హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి అక్కడ న్యాయనిపుణులతో ఇదే విషయాన్ని సీరియస్ గాచర్చించినట్లు సమాచారం.
ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లాలి?
సుప్రీం కోర్టులో తాము కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. తీరా కేటీఆర్ అన్నట్లుగా సుప్రీం కోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తమ పరిస్థితి ఏమిటని లోలోపల మదనపడుతున్నారు. ఎన్నికలు జరిగి కేవలం ఆరు నెలలే అయింది. పైగా వీళ్లంతా బీఆర్ఎస్ తరపున ప్రజామోదంతో, వాళ్లిచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ వ్యతిరేకగాలిలోనూ తమ సత్తా చాటారు. కాంగ్రెస్ లో హేమాహేమీలను సైతం మట్టి కరిపించారు. అయితే ఎన్నికలు కాగానే కాంగ్రెస్ ఆకర్షణకు లోనై ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారయిందని వాపోతున్నారు. తీరా ఎన్నికలు జరిగితే మళ్లీ కాంగ్రెస్ తరపున టిక్కెట్ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా ప్రజలు తమని మళ్లీ గెలిపిస్తారో లేదో తెలియదు. తమ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో సమాప్తం కావలసిందేనా అని బాధపడుతున్నట్లు సమాచారం.
జాతీయ స్థాయిలో పోరాటం
పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు, తెలుగుదేశం నేతలు తమ పార్టీలను వదిలి బీఆర్ఎస్ లో చేరారు కదా..అప్పుడు వాళ్లకు వర్తించలేదా ఈ ఫిరాయింపుల చట్టం అని కేటీఆర్ ని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అసలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే సంస్కృతి మీ పార్టీ నుంచే మొదలయిందని అంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా రెండు పార్టీల మధ్య తాము బలిపశువులుగా మారామని..కొందరు బాధపడుతుండగా..మరి కొందరు మాత్రం ఫిరాయింపుల చట్టం గురించి భయపడాల్సిన అవసరం లేదని..ఆ తీర్పు వచ్చి అమలయ్యేలోగా ఐదేళ్లు పూర్తవుతాయని ధీమాగా చెబుతున్నారు.