Jogulamba Gadwal consecutive deaths(Telangana today news): వరుస మరణాలు ఆ గ్రామాన్ని కలవరపెట్టిస్తున్నాయి. కారణం తెలియకుండానే కన్నుమూస్తున్నారు. పెద్దా, చిన్నా తేడా లేకుండా మృత్యువాత పడడంతో ఆ గ్రామం అల్లాడుతోంది. ఇప్పటికే గత 13 రోజుల్లో 11మంది మృతిచెందారు. దీంతో ఏ క్షణంలో ఎప్పుడు ఏ చావు వార్త వినిపిస్తుందోనని, రేపు ఎవరివంతోనని ఆ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదీ జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం కొండాపురం గ్రామం పరిస్థితి. అయితే ఈ గ్రామంలో ఏదో జరుగుతుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొండాపురం గ్రామంలో వరుస మరణాలతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. జూలై మాసంలో 13 రోజుల్లో పెద్దవాళ్లతోపాటు వృద్ధులు, చిన్నారులతో కలిసి 11 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. అనారోగ్యంతో కొంతమంది మృతిచెందగా.. ప్రమాదవశాత్తు మరికొంతమంది, ఆత్మహత్యతో ఒకరు మృతి చెందంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వృద్ధాప్య సమస్యలతో గోవింద్, వడ్డె సవారమ్మ మృతి చెందగా.. గుండెపోటుతో గోపాల్, విద్యుదాఘాతంతో వడ్డె నర్సింహులు చనిపోయారు. సావిటిరాడి సవారమ్మ, గురమ్మ, మన్యపురెడ్డి, సాలప్ప, రఘు వేర్వేరు కారణాలతో మృతి చెందగా..అదే గ్రామానికి యువకుడు ప్రసాద్ హైదరాబాద్లో సూసైడ్ చేసుకోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
AlSO Read: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవంటున్న కేటీఆర్..ఎందుకు?
ఇదిలా ఉండగా, గ్రామంలో వరుస మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామానికి ఏదో జరిగిందంటూ ఆదివారం అమావాస్య పూజలు చేశారు. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని కుటుంబాల నుంచి రూ.500 వసూళ్లు చేశారు. అనంతరం కడప నుంచి ఓ వ్యక్తిని తీసుకొచ్చి హోమం, పూజలు చేశారు. హూమంతో పూజలు చేస్తే గ్రామానికి పట్టిన పీడ పోతుందని ఆదివారం అమావాస్య కావడంతో పూజలు చేశారు. ఇక ఈ పూజలు చేయడంతో గ్రామానికి మేలు జరుగుతుందన్నారు. అయితే కొంతమంది ఈ మూఢనమ్మకాన్ని కొట్టిపడేస్తున్నారు.