Article 370 Fifth Anniversary: J&K On Path Of Transformation: అది 2019 ఆగస్టు 6 భారత చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికిన రోజు. ఏడు పదుల స్వాతంత్రానికి రెక్కలొచ్చిన రోజు. ఎన్నాళ్లో వేచి చూసిన రోజు. దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దేశం నలుమూలలా జాతీయ జెండా రెపరెపలాడింది. కానీ జమ్ము కాశ్మీర్ లో మాత్రం భారత త్రివర్ణ పతాకం ఎగరలేదు. ఎందుకంటే భారతదేశంలో అప్పటికి జమ్ముకశ్మీర్ అంతర్భాగం కాలేదు. భారత రాజ్యాంగం ప్రకారం జమ్ముకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం. ఆ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 370 నిబంధనను రాజ్యాంగంలో పొందుపరిచారు. అక్కడ ప్రత్యేక నిబంధనలు అమలు అవుతాయి. దేశం మొత్తం ఒక చట్టం ఉంటే అక్కడ మాత్రం ప్రత్యేకం. వారికి ఎటువంటి నిబంధనలూ వర్తించవు. జమ్ము కశ్మీర్ తమ దేశానికే చెందుతుందని పాకిస్తాన్ అప్పటికీ అడపాదడపా దుశ్చర్యలకు పాల్పడుతుండేది.
ఏ చర్య తీసుకోవాలన్నా ఆర్టికల్ 370 ఆటంకమే
జమ్ము కాశ్మీర్ లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. భారత సైనికులు కూడా చాలా మంది అసువులు బాస్తున్నారు. ఆర్టికల్ 370 ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలన్నా ఆటంకంగా మారుతోంది. అనేక మంది అమాయక కాశ్మీర్ పండిట్లు కూడా తమ ప్రాణాలను బలిపెట్టారు. ఆ ప్రాంతంలో ప్రజలతో కలిసిపోయిన టెర్రరిస్టులు అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రాణ భయంతో ముస్లిమేతరులు అక్కడినుంచి పారిపోయారు. ఇక్కడి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్థికంగా ఊతమందిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు టూరిస్టులతో కళకళలాడిన జమ్ముకశ్మీర్ టెర్రరిస్టుల చర్యలతో భయానక వాతావరణంలో ఉంది. డెబ్బై ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా కాశ్మీర్ అంశాన్ని సీరియస్ గా తీసుకోలేదు. స్థానికుల మద్దతుతో టెర్రరిస్టు కార్యకలాపాలు పెరిగిపోయాయి.
మోదీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి రాగానే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అప్పటికే తమ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ దీనిని పార్లమెంట్ లో ఆమోదింపజేశారు.
ద్వంద్వ పౌరసత్వం రద్దు
ఆర్టికల్ 370 రద్దు చేస్తే భారత్ లో ఏదో జరిగిపోతుందని, మత కలహాలు చెలరేగి దేశం మొత్తం అశాంతి నెలకొంటుందని అంతా భయపడ్డారు. అంతా క్షణాలలోనే జరిగిపోయింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఆర్టికల్ రద్దుకు ముందు జమ్ముకశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉండేది. రద్దు తర్వాత భారత పౌరసత్వం మాత్రమే వీళ్లకు వర్తిస్తోంది. భారత సర్వోన్నత న్యాయస్థానం చేసిన చట్టాలు ఏవీ జమ్ము కాశ్మీర్ ప్రాంతానికి వర్తించేవి కావు. కానీ ఆర్టికల్ రద్దు తర్వాత సుప్రీం తీర్పులు, చట్టాలు అన్నీ ఈ ప్రాంతానికి కూడా వర్తిస్తున్నాయి. శాసన సభ్యుల పదవీ కాలం కూడా ఆరేళ్లనుంచి ఐదేళ్లకు తగ్గించేయడం జరిగింది. తలాక్ చట్టం కూడా రద్దు అయింది.
త్వరలోనే జమ్ముకశ్మీర్ ఎన్నికలు
భారతీయులెవరికీ జమ్ముకశ్మీర్ లో భూములు కొనే అర్హత ఉండేది కాదు 370 రద్దుకు పూర్వం. తర్వాత ఇప్పుడు ఏ ప్రాంతం వారైనా యథేచ్ఛగా భూములు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగాల రిజర్వేషన్లు అన్నీ భారత ప్రభుత్వ చట్టాలను అనుసరించి వారందరికీ వర్తిస్తున్నాయి. జమ్ము ప్రాంతపు మహిళలు కేవలం ఆ ప్రాంతంలోని వారినే పెళ్లి చేసుకోవాలనే చట్టం కూడా రద్దయింది. ఇటీవలే సుప్రీం కోర్టు కూడా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సబబే అని ప్రకటించింది. త్వరలోనే ఆ రాష్ట్రంలో ఎన్నికలు కూడా జరిపించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ ఉగ్రకదలికలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు భారత సైత్యం సిద్ధంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయింది.