India vs Sri Lanka 2nd ODI Highlights: శ్రీలంక చేతిలో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. రెండో వన్డేలో ఒక వెటరన్ బౌలర్ వాండర్సే ధాటికి టాపార్డర్ విలవిల్లాడింది. ఏకంగా ఆరు వికెట్లు సమర్పించుకుంది. తొలి వన్డేలో కూడా ఇలాగే ఆడింది. కాకపోతే స్కోరు సమానమైంది. ఇప్పుడు పూర్తిగా తేలిపోయారు. టీ 20 ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ప్రాక్టీసు వదిలేసిన ఫలితం.. శ్రీలంక పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోంది.
శ్రీలంక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో టీమ్ ఇండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.
241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకి ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ ఇద్దరూ శుభారంభం ఇచ్చారు. రోహిత్ హిట్టింగ్ చేస్తుంటే, గిల్ డిఫెన్స్ ఆడుతూ స్కోరుని ముందుకు నడిపించారు. తొలి వన్డే తరహాలోనే మ్యాచ్ సాగింది. 13.3 ఓవర్లలో 97 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ పడింది.
తను 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 64 పరుగులు చేసి వెటరన్ బౌలర్ వెండార్సే బౌలింగులో అవుట్ అయిపోయాడు. తర్వాత కాసేపటికి ఇదే బౌలర్ ఏం చేశాడంటే, గిల్ (35) ని బలి తీసుకున్నాడు. తర్వాత కొహ్లీ (14), శివమ్ దుబె (0), శ్రేయాస్ (7), రాహుల్ (0) ఇలా అందరూ వెండార్సే చేతిలో అవుట్ అయిపోయారు.
147 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా గిలగిల్లాడింది. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్ కాసేపు ఆదుకున్నాడు. తను 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 44 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ డిఫెన్స్ ఆడి ఆడి 40 బంతుల్లో 15 పరుగులు చేసి తను అయిపోయాడు.
ఇక చివర టెయిల్ ఎండర్స్ కులదీప్ (7 నాటౌట్), సిరాజ్ (4), అర్షదీప్ (3 రనౌట్) అయిపోయి…కథ ముగించారు. ఎట్టకేలకు 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
శ్రీలంక బౌలింగులో వెండార్సే 6, చరిత్ అసలంక 3 వికెట్లు పడగొట్టారు.
Also Reada: టీమ్ ఇండియాను వణికించిన.. శ్రీలంక వెటరన్ బౌలర్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంకకి శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ నిశ్శాంక గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. సిరాజ్ తనని అవుట్ చేశాడు. తర్వాత మరో ఓపెనర్ ఫెర్నాండో (40), కుశాల్ (30), సమర విక్రమ (14), చరిత్ అసలంక (25), జనిత్ (12), వెల్లెంగే (39), కమిందు మెండిస్ (40), ధనంజయ (15) ఇలా తలా కొన్ని పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
టీమ్ ఇండియా బౌలింగులో సిరాజ్ 1, అక్షర్ పటేల్ 1, వాషింగ్టన్ సుందర్ 3, కులదీప్ 2 వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబెకి 2 ఓవర్లు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ఓవర్లు వేశాడు. 11 పరుగులు ఇచ్చాడు.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే టై అయ్యింది. రెండో వన్డేలో ఓడిపోయారు. మూడో వన్డే కూడా ఇలాగే ఆడితే సిరీస్ ఓటమితో ఇంటి దారి పట్టాల్సిందే అంటున్నారు.