KCR & YS Jagan as opposition leaders(Political news telugu): వారిద్దరూ ఒకప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాలను ఏలారు. ఇద్దరూ రాజకీయంగా చరిష్మా ఉన్న నేతలే. ప్రజాభిమానాన్ని చూరగొన్న నేతలే. తమ ప్రచారంతో, మాటల వాగ్దాటితో జనాన్ని మెప్పించినవారే. ఒకరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్..మరొకరు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేస్తే..జగన్ ఒక పర్యాయం సీఎంగా చేశారు. పరిస్థితులు ఇద్దరికీ అనుకూలించక అధికారం పోగొట్టుకున్నారు. కొత్త ప్రభుత్వాలు వచ్చి ఆరు నెలలు దాటింది. రెండు తెలుగు రాస్ట్రాలలో అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అయితే కేసీఆర్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంది. జగన్ కు మాత్రం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. అయినా శాసనసభలో జగన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తాడని అంతా భావించారు.
గోల్డెన్ ఛాన్స్ మిస్
ఇటు కేసీఆర్ కూడా తనకి లభించిన బంగారు అవకాశాన్ని వృథా చేసుకున్నారు. ప్రతపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఎండగట్టవలసిన సమయంలో గాయబ్ అయ్యారు. కేవలం ఏక్ దిన్ కా సుల్తాన్ మాదిరిగా ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీకి మొహం చూపించి వెళ్లిపోయారు. సరిగ్గా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ పై నిలదీసే ప్రయత్నం కూడా చేయలేకపోయారు కేసీఆర్. చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయింది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలిగితేనే తర్వాత జరగబోయే ఎన్నికలలో ప్రజల మద్దతు ఉంటుంది. ఆ సంగతి సీనియర్ రాజకీయ మేధావి అయిన కేసీఆర్ తెలుసుకోలేకపోవడం శోచనీయం అంటున్నారు రాజకీయ పండితులు. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలు తీరుపై కేసీఆర్ నిలదీస్తారని భావించారు అంతా. సొంత పార్టీ నేతలే కేసీఆర్ తీరు చూసి మనస్తాపానికి గురవుతున్నారు. కనీసం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకైనా కేసీఆర్ తన స్వరం పెంచితే బాగుండేదని అనుకుంటున్నారంతా. ఉద్యమం సమయంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో విపక్షాలపై విరుచుకుపడిన కేసీఆర్ లో ఆ సత్తా ఇప్పుడేమయిందని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
తీరు మారని జగన్
ఇక ఏపీలో జగన్ పరిస్థితి మరీ విచిత్రం ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు దానిని పక్కన పెట్టేసి ఢిల్లీలో టీడీపీ దాడులపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దాని వలన ఆయనకు ఏం ప్రయోజనం కలిగిందో ఆయనకే తెలియాలి అంటున్నారు రాజకీయ వర్గాలు. జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అయినా అసెంబ్లీకి ఏదో చుట్టం చూపుగా వెళ్లి రావడం తప్ప ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేయడం లేదు. బయట ప్రశ్నించేదానికి, అసెంబ్లీలో ప్రశ్నించేదానికి చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీలో నిలదీయడం అనేది అధికారికం అవుతుంది. బయట నిలదీయడం వ్యక్తిగతం అవుతుంది.
వచ్చే ఎన్నికలకైనా..
పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్, జగన్ ఇద్దరు నేతలూ పార్టీ నేతలతో అంటీముట్టనట్లుగా ఉండేవారు. ఇప్పడు కూడా అదే తరహా ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా కిందిస్థాయి నేతల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ ముందుకు వెళితే తప్ప ఇద్దరు నేతలకూ వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటిదాకా ఇద్దరు నేతలూ ఇగోలకు పోయి అసెంబ్లీ సమావేశాలకు అంటీముట్టనట్లు ఉన్నారు. ఇక ముందు అసెంబ్లీ సమావేశాలకైనా పాలిత ప్రభుత్వాలను గట్టిగా నిలదీసేలా ప్రశ్నలు సంధిస్తూ..నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ..కార్యకర్తలు, కింది స్థాయి నేతల సూచనలు పాటిస్తూ ఉంటే తప్ప జనం ఆదరించరనే సంగతి మర్చిపోకూడదు. వచ్చే ఎన్నికలకు కనీసం ఇప్పటినుంచైనా చురుకుగా ఉండాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.