Himanta Biswa Sarma: లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించేలా తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ తెలిపారు. గువహటిలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్ గురించి తాము ఎన్నికల సమయంలో మాట్లాడామని.. త్వరలోనే దానిపై చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు.
లవ్ జిహాద్ కేసుల్లో యావజ్జీవ కారగార శిక్ష విధించేలా చట్టంలో పొందుపరుస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నూతన నివాస విధానాన్ని తీసుకొస్తుందని, ఈ విధానం ప్రకారం అస్సాంలో జన్మించిన వారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అర్హత ఉంటుందని తెలిపారు.
Also Read: వయనాడ్కు ఆపన్న హస్తం.. నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యేలు
ఎన్నికల హామీల ప్రకారం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, వాటిలో స్థానిక యువతకే అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింల మధ్య భూ విక్రయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ తరహా లావాదేవీలను ప్రభుత్వం నిరోధించకపోయినా వీటిపై సీఎం అనుమతి తీసకోవడం తప్పనిసరి చేసిందని హిమంత బిశ్వ పేర్కొన్నారు.