Bangladesh Violence: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరో సారి అల్లర్లు జరుగుతున్నాయి. ఢాకా నగర శివారులో వేలాది మంది నిరసన కారులు, అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అంతే కాకుండా 20 మందికి పైగా గాయాలయ్యాయి. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగిన హింసాకాండలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే వారిని అడ్డుకునేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్ యువజన విభాగం జుబో లీగ్ క్యాడర్ వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఢాకా శివారులోని మున్షిగంజ్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పెట్రోల్ బాంబులు పేలినట్లు కూడా బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి.
Also Read: ఇరాన్ను రెచ్చగొడుతున్న అమెరికా.. ఆపలేని యుద్ధం మొదలైందా?
వాహనాలకు నిప్పు..
ఢాకాలోని షాబాద్ వద్ద వందలాది మంది విద్యార్థులు రాస్తారోకో చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం ఉదయం ఢాకాలోని బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ వద్ద అనేక వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. కొందరు వ్యక్తులు ఆసుపత్రి ఆవరణలోని ప్రయివేటు కార్లు, అంబులెన్స్లు, బైక్లు, బస్సులను కర్రలతో ధ్వంసం చేసారు. దీంతో ఆసుపత్రి ఆవరణలోని రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది భయాందోళనకు లోనయ్యారు.