Team India coach Sairaj Bahutule statement(Today’s sports news): రాబోవు రోజుల్లో టీమ్ ఇండియాలో అందరూ ఆల్ రౌండర్లే ఉంటారని, ఇదే గౌతంగంభీర్ వ్యూహమని భారత కోచ్ సాయిరాజ్ బహుతులే అన్నాడు. నిజానికి తొలి వన్డేలో గిల్ తో బౌలింగు వేయించి, రోహిత్ శర్మ తప్పు చేశాడనే విమర్శలు వచ్చాయి. అయితే అది మేనేజ్మెంట్ నిర్ణయమని ఇప్పుడు తెలిసింది. ఇదంతా ప్రధాన కోచ్ గౌతంగంభీర్ వ్యూహమని, ఇలాంటి వినూత్న ఆలోచనలు తన బుర్రలో ఎన్నో ఉన్నాయని సాయిరాజ్ అన్నాడు.
టీ 20 సిరీస్ లో ఇలా రింకూ సింగ్, సూర్యకుమార్ అందరూ బౌలింగు చేసి మూడో వన్డేలో సత్ఫలితాలు సాధించారని అన్నాడు. అలాగే రియాన్ పరాగ్ చేత బౌలింగు చేయించడం అందులో భాగమేనని అన్నాడు. ఇప్పుడు రియాన్ రూపంలో ఒక ఆప్షన్ దొరికిందని, పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ బౌలర్ గా తను పనిచేస్తాడని సాయిరాజ్ తెలిపాడు.
ఇదే కోవలో వన్డేలో శుభ్ మన్ గిల్ తో బౌలింగు చేయించినట్టు తెలిపాడు. రాబోవు మ్యాచ్ ల్లో టాపార్డర్ అందరూ బౌలింగు చేస్తారని అన్నాడు. వారు బ్యాటర్లే కాదు, మంచి బౌలర్లు కూడా అని తెలిపాడు. అజారుద్దీన్ ఒకప్పుడు సచిన్ తో బౌలింగు చేయించడం వల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని అన్నాడు. ఆ ప్రయోగం చేసి ఉండకపోతే, సచిన్ బ్యాటర్ గానే మిగిలిపోయేవాడని తెలిపాడు.
ఇదన్ని సందర్భాల్లో వర్కవుట్ అవదని తెలిపాడు. అక్కడ పిచ్ కండీషన్, ప్రత్యర్థి బ్యాటర్లు, టార్గెట్, మ్యాచ్ మూడ్, బ్రేక్ కోసం వెయిట్ చేయడం.. ఇలాంటివెన్నో దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం అమలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. కాకపోతే ప్రత్యామ్నాయాలు రెడీ చేస్తున్నామని తెలిపాడు. మనవాళ్లు బౌలింగు చేయగలరు. కానీ చేయడం లేదు. అందుకే వారి బ్యాటింగు లయ తప్పకుండా బౌలింగు ప్రాక్టీసు చేయిస్తామని తెలిపాడు.
Also Read: ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాల్లో పతకధారి మను బాకర్
నిజానికి 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో మరో ప్రత్నామ్నాయ బౌలర్ లేకనే, మ్యాచ్ ఓడిపోయామని అన్నాడు. మనకున్న రెగ్యులర్ ఐదుగురు బౌలర్లు అక్కడ తేలిపోయారని తెలిపాడు. బుమ్రా, షమీ, రవీంద్ర జడేజా, సిరాజ్, కులదీప్ అంతా కలిసి 5 వికెట్లే తీయగలిగారని అన్నాడు. ఆ రోజున ఆల్ రౌండర్ల వెలితి స్పష్టంగా కనిపించిందని అన్నాడు. హార్దిక్ పాండ్యా లేకపోవడం పెద్ద మైనస్ గా మారిందని తెలిపాడు.
రెగ్యులర్ బౌలర్లు ప్రభావం చూపలేనప్పుడు పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగు చేయిస్తే,ఆట టర్న్ అయ్యే అవకాశం ఉందని గంభీర్ ప్లాన్ అని తెలిపాడు. మొత్తానికి టీమ్ ఇండియా జట్టులో కొన్ని మార్పులకైతే శ్రీకారం చుడుతున్నారని నెటిజన్లు అంటున్నారు.