Attack on a Young Woman in Thadepalli: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడేపల్లిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి వడ్డేశ్వరంలోని స్థానిక ప్రైవేట్ వైద్య కాళాశాలలో మూడేళ్లుగా నర్సుగా పనిచేస్తోంది. అయితే అక్కడే వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటూ విధులకు హాజరవుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఆ యువతి చర్చికి వెళ్లి తిరిగి హాస్టల్కు వెళ్తుంది. ఈ సమయంలో బందరు సమీపంలోని క్రోసూరుకు చెందిన క్రాంతి మౌళి..ఆ యువతితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తాను గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని యువతికి చెప్పగా ఆమె నిరాకరించింది.
తన ప్రేమను యువతి నిరాకరించడంతో క్రాంతి మౌళి ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే క్రాంతి సైకోగా మారి తన వద్ద ఉన్న బ్లేడుతో ఆమె మెడపై దాడి చేశాడు. దీంతో ఆ యువతి భయంతో తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో సైకో క్రాంతిని పక్కకు నెట్టేసే క్రమంలో ఆమె చేతిపై గాయాలు కావడంతో కింద పడిపోయింది. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా..వెంటనే స్థానికులు ఆ నిందితుడిని అడ్డుకున్నారు.
Also Read: విశాఖ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
గాయపడిన యువతికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.