Mohanlal Donation To Wayanad:కేరళలోని వయనాడ్ జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం భారీగా కురిసిన వర్షాలకు అక్కడ కొండచరియలు విరిగిపడటం, వరదలు బీభత్సం సృష్టించడంతో అల్లకల్లోలంగా మారింది. ఊహించని విధంగా విపత్తు తలెత్తింది. దీంతో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. ఇప్పటికీ దాదాపు 340 మందికి పైగా ప్రాణాలు విడిచారు. మరెందరో హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతున్నారు. ఇండ్లు, వాకిలి పోయి బోరున విలపిస్తున్న వారెందరో ఉన్నారు.
వారిని ఆదుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతో మంది సినీ స్టార్లు వారికి తోచిన సహాయం చేశారు. ఈ కష్ట సమయంలో మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ తనవంతు సాయం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగాడు. లెఫ్టినెంట్ కల్నల్గా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా వయనాడ్లో కొండచరియలు వినిగిన ప్రాంతాల్లో సైనికులతో సహా పర్యటించాడు.
ఈ పర్యటనలో అక్కడి ప్రజలను చూసి చలించిపోయాడు. అక్కడ జరిగిన విధ్వంసం అతడిని కంటతడి పెట్టించింది. దీంతో పర్యటన ముగిసిన అనంతరం ఈ విపత్తుపై స్పందించాడు. ఈ మేరకు ఆయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో భాగంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘వయనాడ్లో జరిగిన విధ్వంసం ఒక లోతైన గాయం. అది మానడానికి చాలా సమయం పడుతుంది.
Also Read: స్వయంగా రంగంలోకి.. వయనాడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న స్టార్ హీరో మోహన్ లాల్
ఈ విపత్తులో ఎంతోమంది తమ ఇళ్లు కోల్పోయారు. జీవితం అస్తవ్యస్తంగా మారింది. అందువల్ల డోర్ఫ్-కెటల్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి సహాయక చర్యల కోసం విశ్వశాంతి ఫౌండేషన్ తరపున రూ.3 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందిస్తున్నాం. అంతేకాకుండా మందక్కైలో కూలిపోయిన LP స్కూల్ను తిరిగి పునర్మిర్మాణం చేయడం మా మొదటి లక్ష్యం. మనందరం కలిసికట్టుగా ఉందాం.. ధృడంగా ముందుకు సాగుదాం’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అతడి సహాయానికి అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా విశ్వశాంత్ ఫౌండేషన్ అనేది మోహన్లాల్ స్వయంగా స్థాపించిన ఒక సంస్థ. దీని ద్వారా ఆయన ఇప్పటికి చాలా సహాయాలు చేశాడు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎంతో మందికి తోడునీడగా నిలిచాడు. ఇప్పుడు వయనాడ్కు మొదటి విడతగా రూ.3 కోట్లు విరాళంగా ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నాడు.