Cyclone : ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాములోగా పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.
తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
కాకినాడ జిల్లాలో తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీచుస్తున్నాయి. ఉప్పాడ సముద్రతీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు బంద్ చేశారు.
తమిళనాడులో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది . ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో పలు పోర్టుల్లో 5నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చెన్నై విమానాశ్రయం నుంచి 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు పుదుచ్చేరి నుంచి విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.