Odisha Man Married Five Women : ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితుల్లో ఒక్క పెళ్లి జరగడమే కనాకష్టంగా మారింది. అలాంటిది కొందరు.. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ.. కట్టుకున్నవారిని మోసం చేసి ఉడాయిస్తున్నారు. అలాంటి నిత్య పెళ్లికూతుర్లు, నిత్య పెళ్లికొడుకులు ఎంతోమంది ఉన్నారు. తానొక పోలీస్ అధికారినని చెప్పి.. డబ్బు కోసం ఒకరికి విడాకులివ్వకుండానే మరొకరిని పెళ్లాడుతూ.. ఐదుగురిని వివాహమాడాడో నిత్య పెళ్లికొడుకు. అతడిని నమ్మి పెళ్లిచేసుకుని మోసపోయిన ఇద్దరు మహిళలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది.
ఒక మహిళాపోలీస్ సహాయంతో అతని ఆట కట్టించారు పోలీసులు. విచారణలో విస్తుపోయే విషయం తెలిసింది. ఇంకా 49 మంది మహిళలతో పెళ్లిళ్ల వెబ్ సైట్లలో చర్చలు జరిపినట్లు గుర్తించారు. ఈ నిత్యపెళ్లికొడుకు గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జాజ్ పుర్ జిల్లాకు చెందిన సత్యజిత్ సమత్ కు 34 సంవత్సరాలు. ప్రస్తుతం భువనేశ్వర్ లో ఉంటున్నాడు. అతని టార్గెట్ భర్తలను పోగొట్టుకున్న ఆడవాళ్లు, విడాకులు తీసుకున్న వివాహితలే. మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో తనను తాను ఒక పోలీస్ ఆఫీసర్ గా పరిచయం చేసుకుని.. మీరు నాకు బాగా నచ్చారు, పెళ్లి చేసుకుందాం అని నమ్మించి.. తనకు కట్నంగా డబ్బు, వాహనాలు కావాలని డిమాండ్ చేసి మరీ తీసుకున్నాడు.
అతడిని నమ్మి అలా ఐదుగురు మహిళలు పెళ్లిచేసుకున్నారు. మోసపోయామని గ్రహించి.. ఇచ్చినవి తిరిగివ్వాలని అడిగితే.. తుపాకీతో బెదిరించేవాడు. అతని చెరలో పడి మోసపోయినవారిలో ఇద్దరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అతని కోసం ఒక మహిళా పోలీస్ ను పంపారు. ట్రాప్ చేసి ఆమెను కలిసేందుకు వచ్చినపుడు అతడిని అరెస్ట్ చేశారు. ఒకరి నుంచి రూ.8.15 లక్షలు అప్పు చేయించి మరీ కారుకొన్నాడు. మరొకరి నుంచి వ్యాపారం కోసం రూ.36 లక్షలు వసూలు చేశాడు. ఇంకొకరి నుంచి రూ.8.60 లక్షలతో పాటు ఒక బైక్ ను కూడా తీసుకున్నాడు.
ఈ డబ్బుతో అతను దుబాయ్ కు చెక్కేసి.. విలాసవంతంగా జీవితాన్ని గడిపేవాడు. పోలీసులు అతని నుంచి కారు, బైక్, రూ.2.10 లక్షల క్యాష్, ఒక తుపాకీ, రెండు మ్యారేజ్ అగ్రిమెంట్ పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నారు.