Four People died in One Family: ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మట్టె మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు చంద్రబాబు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుటుంబంపై అర్ధరాత్రి మట్టిమిద్దె కూలడంతో తల్లపురెడ్డి గురుశేఖర్ తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గురుశేఖర్ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో పదవ తరగతి చదువుతున్నది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులు సహా తోబట్టువులు మృతిచెందడంతో ప్రసన్న అనాథ అయ్యింది.
Also Read: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత
ఈ ఘటనపై పూర్తి సమాచారం తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ప్రసన్నకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ సమక్షంలో ఉంటుందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ప్రసన్న పేరుతో రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని, అదేవిధంగా వృద్ధురాలైన నాగమ్మకు రూ. 2 లక్షల సాయం అందించాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ఆమెకు ధైర్యం చెప్పాలని సూచించారు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా ఉంటాన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటూ చంద్రబాబు తెలిపారు.