BRS : తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాజముద్ర వేసింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్కు అధికారికంగా లేఖ పంపింది. దీంతో మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈసీ లేఖకు ఆమోదం తెలుపుతూ సంతకం చేసి పంపించనున్నారు. ఆ వెంటనే బీఆర్ఎస్ పేరు అమల్లోకి వస్తుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలను ఆహ్వానించారు.
ఈ ఏడాది అక్టోబర్ 5న విజయదశమి రోజు తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేసీఆర్తోపాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. అనంతరం తీర్మాన ప్రతిని కేసీఆర్ చదివి వినిపించారు. వెంటనే ఆ తీర్మానంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పార్టీ సీనియర్ నేత, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఈ లేఖను అక్టోబర్ 6 న కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు.
ఆ తర్వాత నెలరోజులకు ఈసీ ఈ లేఖపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు సమాచారం పంపింది. పార్టీ పేరు మార్పిడిపై బహిరంగ ప్రకటన జారీ చేయాలని సూచించింది. దీంతో నవంబర్ 7 న పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ బహిరంగ ప్రకటన చేశారు. అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఈసీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు నిర్ణయించి సీఎంకు లేఖ రాసింది. నిబంధనల మేరకు ఈసీ లేఖకు అంగీకారం తెలియజేయాలి. దీంతో కేసీఆర్ ఆమోదాన్ని తెలుపుతూ లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపుతారు. ఆ లేఖ ఈసీకి చేరిన వెంటనే అధికారికంగా బీఆర్ఎస్ ను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి వెబ్సైట్లో పొందుపరుస్తారు.
భారత్ రాష్ట్ర సమితి జెండా ఎలా ఉండాలో కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ కు తెలంగాణ ముఖచిత్రంతో జెండా ఉంది. భారత్ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించారు కాబట్టి భారతదేశ చిత్ర పటంతో జెండాను రూపొందించారు. గులాబీ రంగు యథాతథంగా ఉంటుంది. పార్టీ గుర్తుగా కారు కొనసాగుతుంది. మధ్యాహ్నం పార్టీ జెండాను కేసీఆర్ ఎగురవేస్తారు.
పార్టీ పేరు మార్పుపై దసరా నాడు చేసిన తీర్మానాన్ని వెంటనే ఈసీ ఆమోదిస్తుందని అప్పట్లో కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పేరిటే మునుగోడులో పోటీ చేస్తామన్నారు. కానీ ఈ ప్రక్రియ ఆలస్యమైంది. డిసెంబర్ 9న ఢిల్లీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహిస్తామని అదే రోజు ప్రకటించారు. గతంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరోజే సమయం ఉండటంతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ తాజాగా నిర్ణయించారు. టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ విడుదల చేసిన లేఖలో… పార్టీ కార్యాలయ చిరునామాలో రాష్ట్రం పేరును తెలంగాణ అని కాకుండా ఆంధ్రప్రదేశ్ అని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.