Minister Ponguleti: రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రక్రియ గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి అధికాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను 3 నెలల్లోగా పూర్తి చేయాలంటూ జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. శనివారం భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..
‘నిబంధనలకు లోబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తీసుకున్నది. మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు రాగా, అందులో హెచ్ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీలలో 6 లక్షలు, అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read: దళిత బంధు పథకంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ‘వారందరిపై చర్యలుంటాయ్’
ఈ దరఖాస్తుదారులు గత నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వీటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భూముల క్రమబద్ధీకరణలో అక్రమాలకు తావులేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లోగా పూర్తి చేయాలి. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి’ అంటూ అధికారులకు ఆదేశించారు.