Tirumala : తిరుమల దర్శనానికి వెళ్లే భక్తలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఆధునిక సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. తిరుమల సమస్త సమాచారం కోసం టీటీడీ ఓ యాప్ ను తీసుకొస్తోంది. తిరుమలకు సంబంధించిన సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం భక్తులకు కలుగుతుంది.
తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ యాప్ ద్వారా అందించేందుకు టీటీడీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే శ్రీవారి దర్శన టికెట్లు,సేవలు, వసతి గృహాలను బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది. తిరుమల సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ యాప్ను రూపొందించే పనిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే యాప్ రూపకల్పన దాదాపు పూర్తైంది. ఈ యాప్ ను త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో గోవింద యాప్ను టీటీడీ తీసుకొచ్చింది. అయితే ఆ యాప్ పూర్తిస్థాయిలో భక్తులకు ఉపయోగపడలేదు. తాజాగా ఆ యాప్ స్థానంలో కొత్త యాప్ రూపొందిస్తున్నారు. దర్శన టోకెన్లను భక్తులు ప్రస్తుతం ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొచ్చే యాప్ ద్వారా భక్తులు సులభంగా గదులు, శ్రీవారి సేవా టికెట్లను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా ఇందులో చేయనున్నారు. మొత్తంమీద టీటీడీ యాప్ అందుబాటులోకి వస్తే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే యాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.