Himachal Cloudburst: హిమాచల్ ప్రదేశ్ లో వరదలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదల కారణంగా శిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ గ్రామంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి అనితాదేవీ అనే ఆ గ్రామవాసి జాతీయ మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా తమ ఇల్లు తప్ప ఊరంతా కొట్టుకుపోయిందంటూ ఆమె తన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.
ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘వరదలు మా ఊరిని ముంచెత్తినప్పుడు మేమంతా నిద్రలో ఉన్నాం. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. దీంతో మా ఇల్లు దద్దరిల్లింది. వెంటనే లేచి ఏం జరిగిందో చూసేందుకు బయటకు వచ్చాం. తరువాత చూస్తే అంతా నీరే కనిపిస్తుంది తప్ప ఇంకేమీ కనిపించడంలేదు. ఊరు మొత్తం కొట్టుకుపోయింది. ఇది చూసి మేం తీవ్రంగా వణికిపోయాం. వెంటనే మేమంతా భగవతి కాళీమాతా ఆలయం వద్దకు చేరుకుని తల దాచుకున్నాం. ఈ వినాశనంలో మా ఇల్లు ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది. నా కళ్ల ముందే అంతా కొట్టుకుపోయింది. దీంతో నేను తీవ్రంగా వణికిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండాలో.. ఎవరితో ఉండాలో తెలియడంలేదు’ అంటూ ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యింది.
Also Read: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?
ఇదే గ్రామానికి చెందిన మరో బాధితురాలు బఖ్షి రామ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘నా కుటుంబంలోని 14 మంది వరదల్లో కొట్టుకుపోయారు. అయితే, వరదలు వచ్చిన విషయం తెల్లవారుజామున నాకు తెలిసింది. ఆరోజు నేను రాంపూర్ లో ఉండడంతో ప్రాణాలతో ఉన్నాను. విషయం తెలిసిన వెంటనే వచ్చి చూస్తే ఏమీ మిగలలేదు’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో తన వాళ్లు ఎవరైనా సజీవంగా ఉంటారేమోనని, ఆమె వెతుకుతున్న తీరును చూసి అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే, గల్లంతైన వారికోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లతో సైతం ఉపయోగిస్తూ వారి జాడను కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, 50 మందికి పైగా గ్రామస్తుల ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ఉన్నతాధికారి మాట్లాడుతూ.. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయని చెప్పారు.