MLA Danam Nagender: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అసెంబ్లీలో తనను కావాలని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారని.. అందువల్లే తాను విమర్శించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో హైదరాబాద్ డెవలెప్ మెంట్ పై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలగించారన్నారు. బయటకు చెప్పలేని పదాలతో వారు దూషించారన్నారు. వారు మాట్లాడింది మైక్ లో రికార్డు కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తనను వారు కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే తాను సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు.
Also Read: దళిత బంధు పథకంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ‘వారందరిపై చర్యలుంటాయ్’
‘నేను చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ వాడుక భాషలోనివే.. కొత్తవేమీ కాదు.. అవి ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెబుతున్నాను. అధికారం కోల్పోవడం వల్ల బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా వారు సభను సజావుగా జరగకుండా అడ్డుంకులు సృష్టించారు. గత పదేళ్లలో ఏనాడు కూడా నా లాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరించి తమ పద్ధతిని మార్చుకోవాలి’ అంటూ నాగేందర్ చెప్పారు.