Huge inflow to Srisailam Project: కృష్ణా నది బిరా బిరా మంటూ పరిగెడుతూ సందడి చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి కిందకు అందంగా పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. దీంతో శీశైలంలో పర్యాటకుల సందడి వాతావణరం నెలకొన్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో భారీగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు పది గేట్లను ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఆనకట్ట వద్దకు భారీగా పర్యాటకులు వస్తున్నారు.
శనివారం తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రాజెక్టు జనాలతో కిటకిటలాడుతుంది. పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో జలాశయం పరిసర మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. మొదటగా శ్రీశైలం చురుకుని అక్కడ శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని, ఆ తరువాత జలాశయం వద్దకు చేరుకుని కృష్ణానది అందాలను వీక్షిస్తున్నారు. అనకట్టుకు రెండు వైపుల నుంచి వాహనాలు భారీగా రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లింగాల గట్టు ప్రాంతంలో చేపల విక్రయాలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది.
Also Read: జనసేన, టీడీపీ దెబ్బకి దిగొచ్చిన జగన్.. కొత్త ప్లాన్ ఇదేనా?
10 గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఎగువ పరివాహక ప్రాంతాలైన సుంకేసుల, జూరాల జలాశయాల నుంచి 4,81,246 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తి 4,64,740 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎడమ, కుడి గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ 62,668 క్యూసెక్కుల నీటిని అదనంగా అధికారులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.