Elephant Rescues Wayanad Victims| వయనాడ్ లో ప్రకృతి ప్రకాపానికి గురైన బాధితుల్లో ఒక వృద్ధురాలు తన మనవరాలితో కలిసి ఎలా బయటపడిందో వివరిస్తూ ఒక వింత ఘటన చెప్పింది. కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడ్దాయి. దీంతో కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారు. 340 మందికి పైగా చనిపోగా.. ఇళ్లు కూలిపోయి వందల సంఖ్యలో ప్రజలు.. ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకా ఎంతోమంది శిథిలాల్లో చిక్కుకొని ఉన్నట్లు సమాచారం.
శిబిరాల్లో ఉన్న బాధితులు చాలామంది తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెబుతున్నారు. కొండచరియలు విరిగి ఇళ్ల పై పడడం, వరదనీరు, బుడద ఇళ్లలోపలికి చేరడంతో వాళ్లు ఇళ్లు కోల్పోయినట్లు తెలిపారు. ఈ బాధితుల్లో ఒకరైన 76 ఏళ్ల సుజాత అనే మహిళ తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ.. ఒక భారీ దంతాల ఏనుగు తనకు రక్షణగా నిలిచిందని ఒక వింత ఘటన గురించి తెలిపింది.
జూలై 30 రాత్రి చూరల్ మాలా ప్రాంతంలో తన మనవరాలు మృదులతో ఇంట్లో సుజాత నిద్రపోతున్న సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా ఇంటి గోడలు కూలిపోయి.. ఇంట్లో బురదమట్టి చేరి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఉన్న ఇద్దరి మెడ వరకు మట్టి చేరింది. ఇదంతా చూసి చిన్నారి మృదుల సహాయం కోసం గట్టిగా కేకులు వేసింది. ఇంతలో ఇంటి లోపలికి ఒక పెద్ద చెట్టు వేర్లతో సహా వరదలో కొట్టుకు వచ్చింది. దీంతో వారుంటున్న ఇల్లు కూడా దిగువ ప్రాంతానికి కొట్టకుపోయింది.
Also Read: మను భాకర్ కోచ్కు షాక్.. ఇంటిని కూల్చేస్తామని నోటీసు
సుజాత తన మనవరాలిని ఎలాగోలా మట్టిలో నుంచి బయటికి తీసి.. వరద నీటిలో దూకింది. మృదులను తన ఛాతిభాగానికి కట్టుకొని నీటిలో చాలా దూరం ఈదుకుంటూ గట్టున చేరింది. అక్కడ చుట్టూ ప్రజలు సహాయం కోసం అర్థిస్తూ.. బిగ్గరగా అరుస్తున్నారు. ఇదంతా చూసి సుజాత భయపడిపోయింది. చలికి వణుకుతూ సమీపంలో ఉన్న ఒక తోటలో ఇద్దరూ తల దాచుకోవడానికి వెళ్లారు. అక్కడ ఒక చెట్టు కింద ఇద్దరూ సేదతీరుతుండగా.. మూడు పెద్ద ఏనుగులు వచ్చాయి. వాటిలో ఓ ఏనుగు సుజాత, మృదుల ఉన్న చోటికి వచ్చి వారిద్దరినే చూస్తోంది.
అంతపెద్ద దంతాల ఏనుగుని చూసి సుజాత భయపడిపోయింది. అయితే ఇక అక్కడి నుంచి లేచి కదిలే ఓపిక లేక ఏనుగు కాళ్ల వద్ద పడి తమను ఏమీ చేయవద్దని వేడుకుంది. చుట్టూ ప్రకృతి ప్రకోపాన్ని గమనించిన ఆ ఏనుగు సుజాత కష్టాన్ని చూసి జాలి పడింది. వారిద్దరిని తన కాళ్ల వద్దే పెట్టుకొని అలాగే కదలకుండా నిలబడింది. మిగతా రెండు ఏనుగులు దెగ్గరకు వచ్చినా.. వారిని అడ్డుకుంది. ఉదయం నిద్రలేచిన తరువాత సుజాత ఆ ఏనుగుని అలాగే నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ఎలాగోలా చుట్టుపక్కల ఇళ్ల వద్దకు వెళ్లి సహాయం చేయమని అర్థించగా.. కొందరు వారికి కట్టుకునేందుకు బట్టలు ఇవ్వగా.. మరికొందరు భోజనం పెట్టారు.
Also Read: వయనాడ్ బాధితులకు కాంగ్రెస్ భారీ భరోసా.. 100పైగా ఇళ్లు కట్టిస్తాం – రాహుల్ గాంధీ
ఆ తరువాత సుజాత కొడుకు, కోడలి వెతుక్కుంటూ ప్రభుత్వ శిబిరానికి చేరింది. అక్కడ వారిద్దరూ గాయపడిన స్థితిలో కనిపించారు. రాత్రి జరిగిన విషయాలన్నీ వారికి వివరించింది. ఆ తరువాత మీడియా ప్రతినిధులతో తనకు ఎదురైన విషాద పరిస్థితులు, ఏనుగు రూపంలో భగవంతుడే అండగా నిలిచిన విషయాలన్నీ పంచుకుంది.