Pawan Kalyan fan Akhil painted Photo(Today tollywood news): అభిమానులు అందరికీ ఉంటారు. అయితే కొందరు హీరోలు తమ అభిమాన కథానాయకుడిని దేవుడిలా పూజలు చేస్తుంటారు. మరికొందరు భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం చూస్తునే ఉంటాం.తమ హీరో పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అభిమానులు. తమిళంలో రజనీకాంత్ అభిమానులు అయితే రజనీకాంత్ గుండు చేయించుకుంటే అభిమానులు కూడా గుండు చేయించుకోవడం చూశాం. అభిమానులే హీరోలకు ఆదాయ వనరులు. వీరి ఆదరణతోనే వాళ్ల సినిమాలు ఆర్థికంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అభిమానులు ఒక్కో సినిమాను కనీసం నాలుగయిదు సార్లయినా చూస్తారు కేవలం తమ అభిమాన హీరో కోసమే.
రికార్డు కలెక్షన్ల హీరోలు
అందుకే బడా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే వారం రోజుల పాటు అడ్వాన్స్ టిక్కెట్లు అమ్ముడైపోతాయి. తొలి వారం తిరగకుండానే బాక్సాఫీస్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో వసూల్లు రాబడుతుంటాయి. అందుకే నిర్మాతలు ఇలాంటి హీరోలకు రెమ్యునరేషన్ కూడా భారీగానే ముట్టజెబుతుంటారు. వీళ్ల సినిమాలు రిలీజ్ రోజున థియేటర్లలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బయట బాణాసంచా కాలుస్తూ..ఫ్లెక్సీలు, దండలతో థియేటర్లను పెళ్లి సందడి ఫంక్షన్ హాళ్ల మాదిరిగా అలంకరిస్తుంటారు. ఒక్కోసారి వీళ్లు హద్దులు మీరి సిల్వర్ స్క్రీన్ చించేసి, సీట్లు విరగగొట్టిన సందర్భాలు లేకపోలేదు.
5 ఎం.ఎల్ రక్తంతో చిత్రం
అయితే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన ఒంట్లోనుంచి తీసిన ఐదు మిల్లీలీటర్ల రక్తంతో పవన్ కళ్యాణ్ బొమ్మను గీశాడు ఆ వీరాభిమాని. అతని పేరు అఖిల్. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజయిన రోజే ఉదయం సినిమా చూసేస్తాడు. ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోలను పెట్టుకుని పూజిస్తుంటాడు. ఎవరైనా పవన్ ని విమర్శిస్తే ఊరుకోడు. వెంటనే వాళ్లకు దురుసుగా సమాధానం చెబుతాడు. అంతలా అభిమానాన్ని గుండెల్లో దాచుకున్న అఖిల్ ఎట్టకేలకు తన సొంత రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశాడు. అఖిల్ చిన్నప్పటినుంచి చిత్రాలు గీయడం అతని హాబీ. అయితే తాను ఇదేదో సంచలనం క్రియట్ చేయడానికో లేక ప్రచారం కోసమో ఇలా చేయడం లేదని అంటున్నాడు అఖిల్. అలాగని ప్రతి ఒక్కరూ రక్తం చిందించి అభిమానాన్ని చాటుకోనక్కర్లేదని..కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఆయన అందిస్తున్న సేవలకు, ఫలితం ఆశించకుండా వచ్చిన వారికి తన వంతు సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి నేతలు ఈ సమాజానికి, నేటి తరానికి కావాలని అంటున్నాడు అఖిల్.
సమాజానికి సందేశం
తాను గీసిన ఈ రక్తపు చిత్రం ద్వారా ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడేలా రక్తదానాన్ని ప్రోత్సహించాలని, రక్తదానంతో ప్రాణాలు కాపాడాలని ప్రతి ఒక్కరినీ ఈ చిత్రాన్ని చూసి అదే స్ఫూర్తిని పొందాలనే ఆశయంతోనే అలా చేశానని అఖిల్ చెబుతున్నాడు. ఇప్పుడు అఖిల్ చూపిన ఆ స్ఫూర్తికి పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ అఖిల్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ రక్తంతో గీసిన పవన్ ఫొటో వైరల్ గా మారింది.