Visakhapatnam MLC Elections(Political news in AP): మొన్నటి ఎన్నికల ఫలితాలతో నిరాశా నిస్పృహలతో..పీకల్లోతు కష్టాలలో పాతుకుపోయిన వైసీపీ కాస్త పుంజుకోవడానికి ఓ ఛాన్స్ వచ్చింది. వచ్చే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేసేందుకు,మళ్లీ పోయిన ప్రతిష్ఠ రాబట్టుకోవడానికి వైఎస్ జగన్ సాయశక్తులా కృషిచేస్తున్నారు. తాము ఇంకా ప్రజలతోనే ఉన్నామని నిరూపించుకునేందుకు..అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపట్టేందుకు సైతం వెనకాడకూడదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రూపంలో వైసీపీకి మంచి అవకాశం వచ్చింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఆగస్టు 13న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. సెప్టెంబర్ 3న కౌంటింగ్ అదే రోజు ఫలితాల వెల్లడి ఉండనుంది. ఇప్పటికే వైఎస్ జగన్ వ్యాహాత్మకంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యన్నారాయణ పేరును ప్రకటించారు. ముందుగా మాజీ మంత్రి అమర్ నాథ్ ను అనుకున్పప్పటికీ బాగా ఆలోచించి బొత్స పేరును ఖరారు చేశారు.
బొత్సకు పోటీ ఎవరు?
ఎన్టీయే కూటమి తమ అభ్యర్థి కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. వైసీపీ అభ్యర్థి గా సీనియర్ నేత బొత్స సత్యన్నారాయణను ఈ ఎన్నికలలో ధీటుగా ఎదుర్కునే నేత ఎవరు ? కూటమిలో అంత సత్తా ఉన్నఅభ్యర్థి ఎవరు అని తర్జనభర్జన పడుతున్నారు. అయితే కూటమి తరపున పోటీ చేసేందుకు చాలా మందే ఉన్నా.. బరిలో ముగ్గురు నిలిచారు. వారిలో ఎవరిని ఎంపిక చేయనున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తమ లీడర్లు ఎవరిని ఎంపిక చేస్తారా అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
గండి బాబ్జీ పేరు దాదాపు ఖరారు?
విశాఖ పట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న గండి బాబ్జీ పేరు దాదాపు ఖరారు కావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ తరపున గత అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ ఆశించి భంగపడ్డారు గండి బాబ్జీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీటు ఇస్తామని చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నట్లు సమాచారం. స్థానికంగానూ గండి బాబ్జీకి మంచి పేరు ఉంది. వైసీపీ నేత బొత్సను ధీటుగా ఎదుర్కునే సత్తా ఉన్న నేతగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ రేసులో కూటమి నుంచి సీతంరాజు సుధాకర్, అనకాపల్లి టీడీపీ నేత షీలా గోవింద్, మైనారిటీ నేత నజీర్, సీనియర్ నేత దాడి వీరభద్రరావులు సైతం ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించే లిస్టులో ఉన్నారు.
వైసీపీ బలమే ఎక్కువ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో పదకొండు స్థానాలు భర్తీ కావలసి ఉంది. అక్కడ వైసీపీ బలమే ఎక్కువ. మొత్తానికి అక్కడ ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉన్నాయి. అందులో ఆరువందల పదిహేను ఓట్లు ఒక్క వైసీపీకే ఉన్నాయి. కాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులకు అంతా కలిపి రెండు వందల పదేహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 12 మంది కార్పొరేటర్లు వైసీపీ కి రాజీనామా చేశారు. ఇంకా మరిన్ని వలసలు ఉండొచ్చని టీడీపీ కూలమి భావిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో బొత్స లాంటి సీనియర్ నేత మాత్రమే ఇలాంటి ఒత్తిడిని తట్టుకుని నిలబడగలరని వైసీపీ వర్గాలు బావిస్తున్నాయి.
ఇరు పక్షాలకూ ప్రతిష్టాత్మకం
వైసీపీ శ్రేణులు ఎలాగైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకుని ఇంకా తమ హవా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని వైసీపీ చూస్తోంది. అందుకు ఇదే సమయమని భావిస్తోంది. ఆ దిశగా తమ కార్పొరేటర్లు,జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను సమాయాత్తం చేస్తోంది. అధికార కూటమి కూడా వైసీపీకి మరోసారి దెబ్బకొట్టి మరోసారి తమ సత్తా చూపాలని ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను భావిస్తోంది.