Telangana Assembly updates(Latest news in telangana): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అనంతరం అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. శాసన సభ సమావేశాలు తొమ్మిది రోజులు(65 గంటల 33 నిమిషాలు) జరిగాయని, ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. 38 శాఖల డిమండ్లను అసెంబ్లీ ఆమోదించిందని వివరించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 17 గంటలకు మించి అసెంబ్లీలో చర్చ జరిగిందని, ఇందులో 24 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని పేర్కొన్నారు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పద్దులపై మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై అసెంబ్లీ ఏకగ్రీవంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను ఆమోదించిందని మంత్రి వివరించారు. ఈ సమావేశాల్లో ఐదు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించిందని తెలిపారు. యువత భవిష్యత్ కోసం స్కిల్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీ ఆమోదించిందని చెప్పారు. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న మరో హామీని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నెరవేర్చామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. టీచర్ల ప్రమోషన్ల కలను నెరవేర్చామని వివరించారు.
జాబ్ క్యాలెండర్ను కూడా బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, అసెంబ్లీలో బీఆర్ఎస్ కేవలం తన మనుగడ కోసం మాత్రమే తాపత్రయపడిందని, ప్రతిపక్షంగా విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. చట్టసభ్యుల విజ్ఞప్తి మేరకు సమావేశాలను రెండు రోజులు పొడిగించామని, కానీ, ఈ కాలంలోనూ బీఆర్ఎస్ గందరగోళం సృష్టించడానికే సమయం కేటాయించిందని మండిపడ్డారు. వారు చెప్పినట్టుగా సభ జరగాలన్నట్టుగా బిహేవ్ చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి బయటికి పోయి కూడా రాజకీయం చేశారని, అయినా.. తాము వారిని సస్పెండ్ చేయాలనే ఆలోచన చేయలేదని వివరించారు.
Also Read: నెల తిరక్కుండానే ఓటీటీలోకి డార్లింగ్.. ఎక్కడ చూడొచ్చు అంటే.. ?
వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచనలో మార్పు రావాలని ఆశిస్తున్నామని, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆలోచనలోనూ మార్పు రావాలని కోరుకుంటున్నామని మంత్రి తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్, వర్గీకరణ తీర్పుపై మాట్లాడుతారని తాము ఆశించామని, కానీ, ఆయన మాట్లాడలేదన్నారు.
అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్కు ఆమోదం తీసుకుని చట్టబద్ధత కల్పించామని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని, తాము అధికారంలో ఉన్నన్ని రోజులు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని మంత్రి వివరించారు. జీవో 46 సమస్యలను పరిష్కరించడానికి మంత్రివర్గ సబ్ కమిటీ కసరత్తు చేస్తున్నదని, భవిష్యత్లో జీవో 46 ఉండదని స్పష్టం చేశారు.