Rahul gandhi on Wayanad landslide(Telugu news live): కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విలయ తాండవం సృష్టించాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రజలు భారీగా ప్రాణాలను కోల్పోయారు. మృతుల సంఖ్య 300కు పైగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. తమ పార్టీ తరఫున బాధితులకు 100కు పైగా ఇళ్లను కట్టి ఇస్తామంటూ హామీ ఇచ్చారు.
పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో సమావేశం తరువాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ తాను చూడలేదంటూ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వాటి మాదిరిలా కాకుండా ఈ ప్రాంతాన్ని భిన్నంగా చూడాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానంటూ ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించి పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. ఈ సందర్భంగా 100 ఇళ్లను కట్టి ఇస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో జరిగిన ప్రాణ, ఆర్థిక నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు రాహుల్ గాంధీకి వివరించారు.
Also Read: చిన్నారుల ఆశ్రమంలో మరణాల మిస్టరీ.. 20 రోజుల్లో 14 మంది ?
ఈ విషాదం జాతీయ విపత్తంటూ ఆయన అభివర్ణించిన విషయం తెలిసిందే. వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్ నిర్మాణం చేపట్టాలంటూ కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆయన తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి గురువారం కొండ చరియలు విరిగిపడిన చురాల్ మలలో పర్యటించారు. తాత్కాలికంగా చెక్కతో ఏర్పాటు చేసినటువంటి వంతెనను దాటి బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో వర్షంలోనే తిరిగి పరిశీలించారు. ఈరోజు కూడా వయనాడ్ లోని ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు.
ఇదెలా ఉంటే.. వయనాడ్ బాధితులకు మానసికంగా భరోసా కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడ్ కు పంపినట్లు కేరళ హెల్త్ మినిస్టర్ వెల్లడించారు.