Paris Olympics 2024 Highlights(Live sports news): కోటి ఆశలతో.. ఒలింపిక్ గ్రామంలో భారత్ తరఫున అడుగుపెట్టిన క్రీడావీరులు ఒకొక్కరుగా నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఒక్క షూటింగులో తప్ప, ఎక్కడా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికి ఒలింపిక్స్ ప్రారంభమై ఆరు రోజులైంది-మూడు పతకాలు సాధించి పడుతూ లేస్తూ వెళుతోంది. ఆ వచ్చిన మూడు పతకాలు కూడా షూటింగులోనే వచ్చాయి. అందులో రెండు పతకాలు మను బాకర్ చేతుల మీదుగా వచ్చాయి. తాజాగా స్వప్నిల్ ఒక కాంస్యం తెచ్చాడు. ఇప్పుడు ఒకసారి మనవాళ్ల ఆట తీరు పరిశీలిద్దాం..
బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫైనల్స్ లో భారత్ కు తొలి డబుల్ పతకాన్ని అందిస్తారని ఆశించిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచింది. ఓడిపోతే ఓడిపోయారు. కనీసం సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస సెట్లలో (21-13, 21-14-21-16) ఓటమిపాలయ్యారు.
అంటే ఫస్ట్ సెట్ లో 13, సెకండ్ సెట్ లో 14 , థర్డ్ సెట్ లో 16 పాయింట్లు సాధించారు. స్టార్టింగ్ 10 పాయింట్ల వరకు సమఉజ్జీగా సాగినా, ఇక అక్కడ నుంచి నీరు కారిపోయారని అంటున్నారు. ఆరోన్- సో వూయి (మలేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. నిజానికి మలేసియా చాలా చిన్నదేశం. అక్కడ ఆటలకి సౌకర్యాలు కూడా పెద్దగా ఉండవు. కానీ భారతదేశంలో ఈసారి ఒలింపిక్స్ కోసం ఖేలో ఇండియా పథకంలో భాగంగా రూ.500 కోట్ల వరకు ఖర్చుచేశారు. ప్రపంచంలోని నిపుణులైన కోచ్ ల ద్వారా శిక్షణ ఇప్పించారు. అవసరమైతే విదేశాలకు పంపించారు. కానీ ఆశించిన ఫలితాలైతే రావడం లేదనే సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read: ఒలింపిక్స్ లో నేడు.. భారత షెడ్యూల్ ఇదే…
మరో దురదృష్టకరమైన కబురు ఏమిటంటే, ఒలింపిక్స్ లో పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 64లో ప్రవీణ్ జాదవ్ ఘోరంగా ఓటమి పాలయ్యాడు. చైనా ఆటగాడు వెంచావో 0-6 తేడాతో ప్రవీణ్ ని ఓడించాడు.
ఇక అథ్లెటిక్స్ విభాగంలో మనవాళ్ల స్థానాలు చూస్తే, ఘొల్లుమనక తప్పదు. పురుషుల 20 కిమీ నడకలో వికాస్ సింగ్ 30వ స్థానం, పరమజీత్ 37వ స్థానం, ఆకాశ్ దీప్ 50వ స్థానంలో నిలిచారు. ఇక మహిళల 20 కిమీ నడకలో ప్రియాంక 41వ స్థానంలో నిలిచింది.
మహిళల 50 మీ రైఫిల్ 3 పొజిషన్స్ క్వాలిఫికేషన్ లో భారత్ కు నిరాశే మిగిలింది. అంజుమ్ 18వ స్థానం, సిఫ్త్ కౌర్ 31వ స్థానంలో నిలిచారు. ఇదండీ సంగతి.. ఇంకా నెటిజన్లు ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపు రాకపోతుందా? ఇంకా తొమ్మిది రోజులు ఉన్నాయి కదా.. అని ఆశగా చూస్తున్నారు. మరి మనవాళ్లు భారతీయుల ఆశలను నెరవేరుస్తారా?లేదా? చూద్దాం.