CM Revanth Reddy Fires On KTR(Political news in telangana): తెలంగాణ శాసనసభలో రెండో రోజు సేమ్ సీన్. చిన్న ఇష్యూను పెద్దగా చేసి రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని ఆరాటం. ప్రభుత్వాన్ని బుల్డోజ్ చేయాలనుకున్న బీఆర్ఎస్ నేతల కుట్రలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. సభా నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటున్న గులాబీ MLAలను స్పీకర్ వారించినా తగ్గేదేలే అన్నట్టు నడుచుకున్నారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసి భంగపాటుకు గురయ్యారు. నిరసన ప్రదర్శనలతో హడావిడి చేసి ఇవాళ్టికి ప్యాకప్ చెప్పారు.
తెలంగాణ శాసనసభలో అక్క తమ్ముడి పంచాయితీ రెండో రోజు కొనసాగింది. బుధవారం సభలో జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పదే పదే సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నుంచి ఎవరూ మాట్లాడుతున్నా అడ్డు తగిలేందుకు ఏం చేయాలో అవన్నీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ వర్సిటీ బిల్లుపై ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు.. నినాదాలు చేశారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివాసీ మహిళ అయిన సీతక్కను అవమానించేలా కొందరు మీమ్స్ పెడుతున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్లోని ఇద్దరు అక్కలను సొంత అక్కలుగానే భావించానన్నారు. బీఆర్ఎస్ వాళ్లను నమ్మిన సొంత చెల్లెనే తీహార్ జైల్లో ఉందన్నారు. సొంత చెల్లె జైల్లో ఉంటే రాజకీయాలు చేస్తూ బజారులో తిరిగే వ్యక్తిని తాను కాదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
దళితుడు స్పీకర్గా ఉంటే.. ఆయనను అధ్యక్షా అనడానికి మనసొప్పకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వార్డు మెంబర్ కూడా కాని హరీశ్రావును మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా?. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని గులాబీ ఎమ్మెల్యేలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదంటూ.. నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ తో బయటికి పంపించేశారు. వారందరినీ తెలంగాణ భవన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శు గుప్పించారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ లా కాకుండా.. చీప్ మినిస్టర్ గా బిహేవ్ చేస్తున్నారన్నారు. మహిళలపై సీఎం అలా మాట్లాడటం కరెక్టు కాదన్నారు.
ఇక అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి కవిత ప్రస్తావన తీసుకురావడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో లేని వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతారని విమర్శించారు. తన గురించి మాట్లాడుతారు అనుకున్న సబిత.. కవితపై మాట్లాడ్డం అక్కడున్న జర్నలిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది.
Also Read: మందకృష్ణ ప్లాన్ ఏ సక్సెస్.. ప్లాన్ బీ కి బీజేపీ సహకరిస్తుందా?
ఈ ఎపిసోడ్ మొత్తం బీఆర్ఎస్ నాటకంగా అభివర్ణించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి. అసెంబ్లీలో బీజేపీ నేతల స్వరం వినిపించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అక్క-తమ్ముడి ఎపిసోడ్ పేరుతో కావాలనే సభా కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడిన కారణంగా తమకు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో అప్పర్ హ్యాండ్ సాధించాలని బీఆర్ఎస్ ఎంత గింజుకుంటున్నా కుదరడం లేదు. ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టున్న హరీష్ రావు గణాంకాలతో సహా కాంగ్రెస్ వైఫల్యాలను వివరించినా..రేవంత్ కౌంటర్లతో అవన్నీ తేలిపోయాయి. అసలే కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఎక్కడా దొరుకుతారా..? అని వెయిట్ చేస్తోన్న బీఆర్ఎస్ కు మహిళ ఆ పార్టీ ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకోవాలని ఫిక్స్ అయింది.
కేటీఆర్.. వెనక ఉన్న మహిళా ఎమ్మెల్యేలను నమ్మకు.. నన్ను కూడా మోసం చేశారని రేవంత్ అనడంతో అది తమనే అన్నారని సబితా శోకం పెట్టారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో స్పష్టంగా వివరించడంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది. అయినా తమకు పంటి కింద రాయిలా మారిన రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు ఈ వ్యాఖ్యలను అస్త్రంగా వినియోగించుకోవాలని భావించడంతో ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగిస్తే ఏం లాభం అనుకున్నారేమో కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇంతకీ సభలో బుధవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
వాస్తవానికి సభ వాయిదా పడటంతో ఈ వ్యవహారం ముగిసినట్టే అనుకున్నారు. కానీ , సభలో జరిగిన వ్యవహారం అక్కడితో ముగిస్తే బీఆర్ఎస్ కు లాభం ఉండదని అనుకొని మహిళలను రేవంత్ అవమానించారని సెంటిమెంట్ రాజకీయం ప్రారంభించారు. అందులో భాగంగానే నిరసనలు. అసలే ఎలాంటి అస్త్రాలు లేక బేలగా మారిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ముందుంచి రాజకీయం చేయడం ఆ పార్టీ నిస్సహాయతను స్పష్టం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.