Tamil Producers Council verses Nadigar sangam clashes
ప్రశాంతంగా ఉండే కోలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా రెండు వర్గాల గురించే మాట్లాడుకుంటున్నారు. నిర్మాతల మండలి వర్సెస్ నడిగర సంఘం. నడిగర సంఘం అంటే అగ్ర నటీనటుల నుంచి చిన్న నటుల దాకా సభ్యులుగా ఉండే గ్రూప్ అది. నిర్మాతల మండలి లో ప్రొడ్యూసర్లు అంతా కలిసి మరో గ్రూప్ ఇప్పుడు ఈ రెండు గ్రూపుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల నిర్మాతల మండలి హీరో ధనుష్ వ్యవహారంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఈ హీరోకి నిర్మితల మండలి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ధనుష్ అడ్వాన్సులు తీసుకుని సినిమా షూటింగులో పాల్గనకుండా నిర్మాతలను టార్చర్ పెడుతున్నాడని ఫిర్యాదు రాగా..దానిపై స్పందించిన నిర్మాతల మండలి ఇకపై తీసుకున్న అడ్వాన్స్ కు న్యాయం చేసేలా ఆ మూవీ పూర్తి అయ్యాకే వేరే సినిమా షూటింగ్ లో పాల్గొనాలని హీరో ధనుష్ కు నోటీసు పంపింది.
నడిగర సంఘం ఖండన
గతంలో విశాల్ కూ ఇదే తరహా అనుభవం ఎదురయింది. అయితే నడిగర సంఘం మాత్రం హీరో ధనుష్ కు మద్దతుగా నిలిచింది. ధనుష్ పై నిర్మాతల మండలి పెట్టిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నడిగర సంఘానికి అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నాజర్ వ్యవహరిస్తున్నారు. నాడు ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన నడిగర సంఘం నటీనటుల తరపున నిలచి వారి సమస్యలపై పోరాడుతూ వస్తోంది.
నిర్మాతల ఆవేదన
నిర్మాతల మండలి కూడా హీరోహీరోయిన్ల వ్యవహార శైలిపై విసిగిపోయి ఉన్నారు. సినిమా నిర్మాణం కోసం అష్టకష్టాలు పడి, అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమా బిజినెస్ అయినా, అవ్వకపోయినా ..తాము ఆర్థికంగా నలిగిపోతూ నటీనటులకు మాత్రం రెమ్యునరేషన్ ఇచ్చుకుంటూ వెళుతున్నామని..నిర్మాతలు ఆర్థికంగా నిలబడితేనే సినిమా పరిశ్రమ కళకళలాడుతుందని అంటున్నారు. ఒకవేళ నిర్మాత ఆర్థికంగా నష్టపోతే ఆయన సినిమాలో నటించిన ఏ హీరో కూడా రెమ్యునరేషన్ లో సగం తగ్గించి తిరిగి ఇవ్వరు. ఒక్క సినిమా అటో ఇటో అయితే నిర్మాత పరిస్థితి ఇక అంతే. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలు హీరోలకు అడ్వాన్సులు ఇచ్చుకుని సంవత్సరాల తరబడి వాళ్ల డేట్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఇకపై రాకూడదని ..కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నామని అంటున్నారు.
15 నుంచి షూటింగులు బంద్
ఆగస్టు 15 నుంచి నిరవధికంగా షూటింగులు కూడా నిలుపుదల చేస్తామని అంటున్నారు. లేకుంటే హీరోలు తాము తీసుకున్న అడ్వాన్సులను తిరిగి ఇచ్చేయాలని..ఇది హీరోలకే కాదు నటీనటులెవరికైనా వర్తిస్తుందని అంటున్నారు. నడిగర సంఘం మాత్రం ఎవరో కొద్ది మంది నటులు చేసిన పనికి అందరిపై చర్య తీసుకోవడం భావ్యం కాదన్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అంటున్నారు. నిర్మాతలలో కూడా రెమ్యునరేషన్ ఇవ్వకుండా తమకు నష్టాలు వచ్చాయని చెప్పి నటీనటులను మోసం చేస్తుంటారని..అలా ఎవరో కొద్ది మంది ఉన్నంత మాత్రాన షూటింగులే ఆపుకుంటారా అని నడిగర సంఘం కూడా చూద్దాం..ఇది ఎంతవరకూ వెళుతుందో మేమూ చూస్తాం. నియంతృత్వ ధోరణితో నిర్మాతలు వ్యవహరిస్తే నడిగర సంఘం కూడా చూస్తూ ఊరుకోదని అంటున్నారు. మరి అక్కడి ప్రభుత్వం వీరి మధ్య సానుకూల వాతావరణం ఏర్పడేలా కృషిచేస్తుందేమో చూడాలి.