Char Dham Yatra halted due to heavy rains in Uttarakhand red alert issued : భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. పలు చోట్ల భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలు, వరదలకు 14 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే అక్కడికి చేరుకున్న యాత్రికులను ఎన్డీఆర్ఎఫ్ సహాయ బృందాలు, రెస్క్యూ టీమ్ వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెక్కింగ్ మార్గంలో మరో వెయ్యి మంది ఇరుక్కుపోయారు. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుఖీనదీ తీరం వద్ద నిలిపివున్న వాహనాలు నదీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సహాయక బృందాలు, సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రయాణికులు ఉత్తరాఖండ్ పర్యటన వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. రుద్రప్రయాగ్, తెహ్రీ జిల్లాలలో భారీ వర్షాలు తీవ్రప్రభావం చూపుతున్నాయి. దీనితో అధికారికంగా శుక్ర, శనివారం కేదార్ నాథ్ యాత్రను నిలిపేసినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. సైన్యం కూడా రంగంలోకి దిగింది. వరద ప్రాంతాలలో ఇరుక్కున్న వారిని హెలికాప్టర్ల సాయంతో వారిని తరలిస్తున్నారు. ఇందుకుగాను అదనంగా ప్రైవేటు హెలికాప్టర్లను కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధం చేసింది.
ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సీఎం
ట్రెక్కింగ్ రూట్లలో అనుమతులు నిషేధించామని డీజీపీ తెలిపారు. రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని..అక్కడ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరవైకి పైగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలను చేపట్టారని డీజీపీ తెలిపారు. సహాయక కేంద్రాలలో ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏ ఇబ్బందులు తలెత్తినా తక్షణమే ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే సహాయక బృందాలతో తక్షణ సాయం అందిస్తామని డీజీపీ తెలిపారు.