Karnataka: తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఓ యువతి వెంటబడ్డాడు. అంగీకరించకపోవడంతో ప్రైవేట్ చిత్రాలను ఫేస్బుక్లో పోస్టు చేసి హెచ్చరించాడు. వాటిని డిలీట్ చేయించడానికి ఆమె అతడిని కలిసింది. మాటా మాటా పెరిగింది. వివాదం జరుగుతుండగానే యువకుడు అప్పటికే కొనుక్కున్న రెండు కత్తుల్లో ఒకదాన్ని తీసి పొడిచేశాడు. యువతి విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలిపెట్టింది. బాడీని పక్కనే తుప్పల్లోకి నెట్టేసి ఏమీ ఎరుగనట్టు ట్రైన్ ఎక్కి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులకు ఆ నిందితుడిని పట్టుకోవడం సవాల్గా మారింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ నిందితుడు రోజుకో కొండ ఎక్కాడు. మొబైల్ ఫోన్ తనను పట్టిస్తుందని తెలుసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఇంటి వద్దే వదిలిపెట్టేసి వెళ్లిపోయాడు. ఆ యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలే చేయాల్సి వచ్చింది. ఎలా పట్టుకున్నారో ముందు తెలుసుకుందాం.
కర్ణాటక గుల్బర్గా జిల్లాకు చెందిన 20 ఏళ్ల యశశ్రీ షిండే మహారాష్ట్రలోని బేలాపూర్లో ఉద్యోగం చేస్తున్నది. చాన్నాళ్లు దావూద్ షేక్ ఆమె వెంటపడుతూ వేధించాడు. 2019లోనే యశశ్రీ షిండే దావూద్ పై ఫిర్యాదు ఇవ్వగా.. పోక్సో కేసు నమోదైంది. నెలన్నర రోజులు జైలు జీవితం గడిపాడు. బెయిల్ పై బయటికి వచ్చి కూడా మళ్లీ యశశ్రీ వెంటపడ్డాడు. యశశ్రీని పెళ్లి చేసుకుని తిరిగి కర్ణాటకలోనే సెటిల్ అయిపోవాలని దావూద్ భావించాడు. కానీ, దావూద్ను యశశ్రీ నిరాకరించేది. దావూద్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే.. మిత్రుడు మొహ్సిన్ ఫోన్ నుంచి కాల్ చేసేవాడు.
ఆమెను వేధిస్తూ ఏ స్థాయికి వెళ్లాడంటే తనను కలవకుంటే ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. జులై 22వ తేదీన దావూద్ కర్ణాకట నుంచి 23న నవి ముంబయి చేరుకున్నాడు. తర్వాతి రోజే తనను కలవాలని యశశ్రీని డిమాండ్ చేశాడు. ఆమె తిరస్కరించింది. ఫేస్బుక్లో పోస్టు చేసిన ఫొటోలను డిలీట్ చేయించడానికి చివరికి కలువాలని అనుకుంది.
ఉద్యోగానికి హాఫ్ డే లీవ్ పెట్టి జూయి నగర్ రైల్వే స్టేషన్లో దావూద్ను కలవడానికి యశశ్రీ వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే ఆవేశంతో యశశ్రీని దావూద్ పొడిచేసి హత్యచేశాడు. ఆ తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి పన్వేల్కు ట్రైన్లో వెళ్లిపోయాడు. అక్కడ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకుని కర్ణాటకకు బస్సులో వెళ్లాడు.
Also Read: 18 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సస్పెండ్.. స్పీకర్ సంచలన నిర్ణయం
పోలీసులకు యశశ్రీ డెడ్ బాడీ లభించింది. ఆమె బాడీపై దావూద్ పేరుతో టాటూలు ఉన్నాయి. అవి నిజంగా ఆమె ఉద్దేశపూర్వకంగా వేయించుకున్నదా? బలవంతంగా వేయించాడా? అనేది దర్యాప్త తర్వాత తేలనుంది.
ఇక ముంబయి నుంచి కర్ణాటకకు చేరుకున్న నిందితుడు దావూద్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని నానమ్మకు ఇచ్చేశాడు. అక్కడి నుంచి కాలి నడకన ఊరి సమీపంలోని కొండ ఎక్కాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రోజుకో కొండ ఎక్కి దిగాలని అనుకున్నాడు. పోలీసుల నిఘా నుంచి ఇలా విజయవంతంగా తప్పించుకున్నాడు. దావూద్ కదలికలను కలిపి చూసి పోలీసులు పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నమే చేశారు. అయితే, స్థానిక ప్రజల నుంచి కొన్ని వివరాలు సేకరించి కర్ణాటకలోని షాపూర్ సమీపంలోని కొండ మొదట్లో దావూద్ను పోలీసులు పట్టుకున్నారు. ఐదురోజులపాటు సాగిన వేటలో జులై 30వ తేదీ ఉదయం 5 గంటలకు పోలీసులు దావూద్ను పట్టుకున్నారు.
2019 పోక్సో కేసులో కోర్టుకు హాజరు కావడం లేదని దావూద్కు పన్వేల్ కోర్టు జులై 20వ తేదీన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం గమనార్హం.