Congress : గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఇన్ని తక్కువ స్థానాలు రాలేదు. 1985 ఎన్నికల్లో 149 స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. ఈ రికార్డును 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు బీజేపీ బద్దలు కొట్టింది. 1990 ఎన్నికల్లో కాంగ్రెస్ కు అతి తక్కువగా 33 సీట్లు మాత్రమే దక్కాయి. 1995లో 45, 1998లో 53, 2002 లో 51, 2007లో 59, 2012 లో 61 , 2012లో 77 స్థానాలను కాంగ్రెస్ సాధించింది. 2002 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్థానాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. కానీ ఈ సారి ఘోర పరాజయం ఎదురైంది. హస్తం పార్టీ కేవలం 17 స్థానాలకే పరిమిత కావడం విస్మయం కలిగిస్తోంది.
కాంగ్రెస్ తప్పిదాలు
2017 ఎన్నికల సమయంలో గుజరాత్ లో కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్, అప్పటి గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అశోక్ గహ్లోట్ వ్యూహరచన చేయడంతో బీజేపీ గట్టిపోటీని ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకుంది. ఈ పరిణామం బీజేపీలో ప్రమాద ఘంటికలను మోగించింది. ఈ సారి కమలనాథులు మొదటి నుంచే అప్రమత్తమయ్యారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2017లో కాంగ్రెస్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్పటేల్ను బీజేపీలోకి చేర్చుకున్నారు. కీలక కులాలకు ప్రాతినిధ్యం వహించే నేతలను హస్తం వదులుకొంటే.. కమలం ఒడిసి పట్టింది. కున్వర్జీ బవలియా (కోలి), హార్దీక్ పటేల్ (పాటీదార్), అల్పేశ్ ఠాకూర్(ఓబీసీ) కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలస వచ్చారు. ఇలా ఎన్నికల్లో ప్రభావం చూపించే నేతలందరూ పార్టీని వీడటం కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలిగించింది. గుజరాత్ లో ఎంతో కీలకమైన పటేల్ ఓట్లను చీల్చడంతో పూర్తి విఫలమైంది.
ఖామ్ ఫార్ములా విఫలం
కాంగ్రెస్ గతంలో అనుసరించిన KHAM- క్షత్రియ, హరిజన , ఆదివాసీ, ముస్లిం వ్యూహాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రవిజయ్ సిన్హ్ గోహిల్ను జులైలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. మొత్తం ఏడుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఎస్సీ వర్గానికి చెందిన జిగ్నేశ్ మేవానీ, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఖాదిర్ ఫిర్జాదాలకు కూడా స్థానం కల్పించింది. ఈ వ్యూహం పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చలేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్ వ్యూహలేవి?
2017లో గుజరాత్లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత బలమైన ప్రతిపక్షంగా నిలవడంలో విఫలమైంది. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ గుజరాత్లో అడుగుపెట్టింది. సూరత్ నగరపాలికలో 27 స్థానాలను దక్కించుకొంది. మరో వైపు ప్రచార సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకే ప్రాధాన్యత ఇచ్చారు. రాహుల్ కేవలం సూరత్, రాజ్కోట్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రచారంలో వెనుకబడింది. ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీని ఫలితంగాే 16 సీట్లకు హస్తం పార్టీ పరిమితమైంది.