BJP : గుజరాత్ ఎన్నికలకు బీజేపీ బహుముఖ వ్యూహాలతో బరిలోకి దిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఎన్నికలకు ఏడాది ముందుగానే సీఎం పదవి నుంచి విజయ్ రూపానీని తప్పించింది. కేబినెట్ ను ప్రక్షాళన చేసింది. ఇలా రూపానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు చెక్పెట్టింది. భూపేంద్ర పటేల్ ను సీఎంను చేసి పటేల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని పోగొట్టింది. ఈ సారి ఎన్నికల్లో 25 శాతం సీట్లు ఆ వర్గానికే ఇచ్చింది. దీంతో పటేళ్ల ఓట్లు గుంపగుత్తుగా బీజేపీకి పడిపోయాయి.
కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీలకు స్థానం కల్పించింది. గుజరాత్లో 37 శాతం ఉన్న ఓబీసీ ఓటర్లు 90 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయిస్తారు. కున్వర్జీ బవలియా (కోలి), హార్దీక్ పటేల్ (పాటీదార్), అల్పేశ్ ఠాకూర్(ఓబీసీ) కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలస వచ్చారు. ఇది బీజేపీకి బలం చేకూర్చింది. పనితీరు సరిగాలేని 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి టిక్కెట్ ఇవ్వలేదు. ఈ చర్యలు బీజేపీ ఇమేజ్ను పెంచాయి. ఇలా పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసింది. ఆ వ్యూహాలన్నీ ఫలించాయి. గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని కమలం పార్టీకి కట్టబెట్టాయి.
మోదీ ఇమేజ్.. షా మంత్రాంగం
ఎన్నికలకు ఏడాది ముందే ప్రధాని మోదీ గుజరాత్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది మార్చి నుంచి మోదీ 20 రోజులు గుజరాత్లోనే గడిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ పర్యటనలు చేపట్టారు. ఇక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేపట్టిన సుడిగాలి పర్యటనలు ప్రభావం చూపాయి. మోదీ 31 ర్యాలీలు, 2 భారీ రోడ్షోలు నిర్వహించారు. అహ్మదాబాద్ లో 30 గంటల్లో 50 కిలోమీటర్లు ప్రయాణించి 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య 16 రోజులు గుజరాత్లో ఉన్నారు. అమిత్ షా 50కిపైగా ర్యాలీల్లో పాల్గొని ప్రచారం చేశారు. ఉత్తర గుజరాత్లోని నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాత్మక బృందాలను అమిత్షా ఏర్పాటు చేశారు.
అభివృద్ధి -ఉపాధి
ఆత్మనిర్భర్ గుజరాత్ కార్యక్రమం కింద 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి యువతను ఆకట్టుకుంది. వేదాంత-ఫాక్స్కాన్ సెమీకండెక్టర్ ప్లాంట్, టాటా -ఎయిర్ బస్ విమాన తయారీ యూనిట్ ప్రాజెక్టులు ఎన్నికల ముందు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించింది. సహకార సమాఖ్యలపై పట్టు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఫలితాన్నిచ్చింది.
కలిసొచ్చిన ఆప్ పోటీ
ఈ సారి గుజరాత్ ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడటం కాషాయ పార్టీకి బాగా కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉన్న సమయంలో ఆప్ బరిలోకి దిగడం కాంగ్రెస్కు నష్టం కలిగించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ భారీగా చీల్చింది. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కురిపించిన ఉచిత హమీలను నమ్మశక్యం కాని తాయిలాలుగా ప్రచారం చేయడంలో బీజేపీ నేతలు విజయం సాధించారు. గుజరాత్ ఆత్మగౌరవ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి పట్టుసాధించారు.
పక్కా వ్యూహం
గుజరాత్లో ఎన్నికలకు కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్, గుజరాత్ నాయకులతో ఎన్నికల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో కేంద్ర మంత్రులు అమిత్షా, భూపేంద్ర యాదవ్, పురుషోత్తమ్ రూపాలా, పీయూష్ గోయల్, మన్సుఖ్ మాండవీయ ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, పార్టీ నాయకులు అమిత్ ఠక్కర్, సీఆర్ పాటిల్, ప్రదీప్ సింగ్ వాఘేలా, ఆర్ఎస్ఎస్ నుంచి అతుల్ లిమాయ్ లాంటి 150 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. అసంతృప్తితో పార్టీని వీడిన వారిని తిరిగి తెచ్చే బాధ్యతను హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తీసుకున్నారు. ఆదివాసీ జాతులు ఎక్కువగా ఉన్న 14 జిల్లాల్లో ప్రచారాన్ని అమిత్ ఠక్కర్ కు అప్పగించారు. ఇలా అన్నివర్గాల ఓటర్లను ఆకర్షించడంలో కాషాయ పార్టీ సఫలమైంది. దీంతో గుజరాత్ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది.