Controversy: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వేరే దేశ అధ్యక్షుడిపై మాటల యుద్ధాన్ని మొదలుపెట్టారు. వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోపై నోరుపారేసుకున్నారు. వెనిజుల అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. ఎలన్ మస్క్ ట్వీట్ నేరుగా వెనిజుల అధ్యక్షుడు మదురో కంటపడింది. దీంతో ఆయన కూడా షార్ప్గా రియాక్ట్ అయ్యారు. ఏకంగా ఎలన్ మస్క్కు సవాల్ విసిరారు.
వెనిజుల అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాల్లో 51 శాతం ఓట్లు మదురోకే వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రతిపక్ష నేతకు 44 శాతం ఓట్లు మాత్రమే దక్కాయని పేర్కొన్నారు. అయితే, వెనిజుల ఎన్నికల సంఘం అధ్యక్షుడైన మదురోకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోపై విరుచుకుపడ్డారు.
మదురో.. అధ్యక్ష పదవిని వదిలిపెట్టు అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. కమ్యూనిస్టు నిరంకుశుడైన నికోలస్ మదురో పాలనకు అంతం పలకాలని ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. ప్రతిపక్షం అద్భుత విజయం సాధిస్తున్నట్టు డేటా వెల్లడిస్తున్నదని వివరించారు. ఏళ్ల తరబడి సాగుతున్న సామ్యవాద పాలన ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నదని తెలిపారు.
Also Read: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ.. ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారో తెలిస్తే షాకవుతారు!
అయితే, ఈ ట్వీట్ మదురో దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా ఒక వర్చువల్ రియాలిటీని సృష్టిస్తుందని, ఆ వర్చువల్ రియాలిటీని ఎవరు నియంత్రిస్తారు? అంటూ మదురో ప్రశ్నించారు. దాన్ని నియంత్రించేది వెనిజుల దేశానికి శత్రువైన ఎలన్ మస్క్ అని పేర్కొన్నారు. తాను ఎలన్ మస్క్కు భయపడనని వివరించారు. ‘నువ్వు ఫైట్ చేయాలని అనుకుంటున్నావా? మరి చేయ్. ఎలన్ మస్క్, నేను రెడీ. నేషనల్ టెలివిజన్లో ఫైట్ చేద్దాం’ అని సవాల్ చేశారు.