Landslides: కేరళలోని వయనాడ్లో జరిగిన విలయంపై కేంద్రమంత్రి అమిత్ షాకు కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య వాద ప్రతివాదనలు జరిగాయి. పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా కేరళ విషాదంపై మాట్లాడుతూ.. కుండ పోత వర్షం పై ముందుగానే కేరళకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రెడ్ అలర్ట్ అప్పటికే జారీ చేశామని వివరించారు. ఈ వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. ఐఎండీ ఎలాంటి రెడ్ అలర్ట్ జారీ చేయలేదని స్పష్టం చేశారు.
‘జులై 18వ తేదీన కేరళ పశ్చిమ తీరంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. జులై 25వ తేదీన ఇక్కడ భారీ వర్షం కురుస్తుందని అంచనాలు వచ్చాయి. ఈ అంచనాల నేపథ్యంలోనే జులై 23వ తేదీన ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రీజియన్కు పంపించాం’ అని అమిత్ షా పార్లమెంటులో వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. ఐఎండీ హెచ్చరికలు వచ్చాయని, కానీ, వయనాడ్కు సంబంధించి ఎలాంటి రెడ్ అలర్ట్లు జారీ చేయలేదని తెలిపారు. ‘కొండచరియలు విరిగిపడిన తర్వాతే వయనాడ్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం ఉదయం వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి.’ అని విజయన్ వివరించారు. అయితే, నెపాన్ని వేరే వారిపై నెట్టేయడానికి ఇది సమయం కాదని, అమిత్ షా వ్యాఖ్యలను తాను విరోధభావంతో తీసుకోవడం లేదని తెలిపారు.
Also Read: Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”
వయనాడ్ జిల్లాలో 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం విజయన్ తెలిపారు. అంచనాల కంటే కూడా చాలా తీవ్రమైన పరిస్థితులు ఇక్కడ చోటుచేసుకున్నాయని వివరించారు. ఐఎండీ కేవలం ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని, అంటే అక్కడ 6 సెంటిమీటర్ల నుంచి 20 సెంటిమీటర్ల వరకు వర్షం కురుస్తుందనే అంచనా వచ్చిందని చెప్పారు. ఇక రెడ్ అలర్ట్ అంటే 24 గంటల్లో 20 సెంటిమీటర్లకు మించి వర్షం కురుస్తుందని వివరించారు.