Kerala: పచ్చని తేయాకు తోటలు, చెట్లు.. కొండలపై నుంచి జలజలపారే జలపాతాలు.. ఎటు చూసినా కనువిందు చేసే ప్రకృతి సోయగం. పర్యాటకులు కేరళకు ఇందుకే వెళ్లుతారు. ప్రకృతి అందాలను నేరుగా పరికించాలని, అనుభూతి చెందాలని ఈ దేవ భూమికి వెళ్లుతారు. కేరళ కూడా టూరిజాన్ని అందుకు తగినట్టుగానే ప్రమోట్ చేస్తుంది. కానీ, ఇప్పుడు కేరళ అందుకు విరుద్ధంగా.. ఇక్కడికి రావొద్దు అనే మెస్సేజీ ఇచ్చింది. దయచేసి డార్క్ టూరిజం చేయొద్దని కేరళ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
వయనాడ్ జిల్లాలో మెప్పడి ఏరియాలో కొండచరియలు విరిగిపడి సుమారు 150 మంది మరణించారు. ఈ విలయం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలు, విషాద దృశ్యాలను నేరుగా చూడాలనే ఆలోచనతో ఎవరూ రావొద్దని కేరళ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇది సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తుందని వివరించారు. సహాయం కోసం 112 నెంబర్కు కాల్ చేయండని పేర్కొన్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో కేరళ విలయాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో కొందరు అక్కడికి వెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు ఈ వార్నింగ్ మెస్సేజీ పోస్టు చేశారు.
ప్రకృతి అందాలనో.. పర్యావరణాన్ని ఆస్వాదించాలనో, ఆహ్లాదకరంగా సమయాన్ని గడపాలనో చేసే పర్యటనలకు ఇవి భిన్నమైనవి. డార్క్ టూరిజం అంటే.. గతంలో జరిగిన మారణహోమాలు, యుద్ధాలు, ప్రమాదాలు, విషాదాలకు సంబంధించిన ప్రాంతాలు పర్యటించి.. అక్కడ జరిగిన ఘటనలను స్వయంగా ఊహించుకుంటూ ఉంటారు. ఆ విషాద ఘటనలను మళ్లీ ఊహించుకుని, తమను తాము ఆ పరిస్థితిలో ఉండే ఏం చేస్తామనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇది కొత్తదేమీ కాదు. ఆష్విజ్ నుంచి చెర్నోబిల్ వరకు, గెట్టిస్బర్గ్ నుంచి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురైన ప్రాంతానికి ఇప్పటికీ పర్యాటకులు వెళ్లుతుంటారు. గతంలో వాటర్లూ యుద్ధం జరుగుతుంటూ ప్రత్యక్షంగా చూడటానికి వెళ్లినవారూ కూడా ఉన్నారని టూరిజం ప్రొఫెసర్ జే జాన్ లేనన్ ది వాషింగ్టన్ పోస్టులో రాశారు. చాలా ముందే చాలా కాన్షియస్గా ఈ ట్రాజెడీ డెస్టినేషన్ను టూర్ కోసం ఎంచుకుంటున్నారనీ వివరించారు.
Also Read: వయనాడ్ లో గంటగంటకూ పెరుగుతున్న మరణాలు.. 143కి చేరిన మృతులు
ఇప్పుడు కేరళ వయనాడ్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో నాలుగు గంటల వ్యవధిలోనే మూడు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనితో కొన్ని ఊర్లు ఆ చరియల కిందే మునిగిపోయాయి. సమీపంలోని నదిలోనూ పలువురు కొట్టుకుపోయారు. మృతుల సంఖ్య సుమారు 150కు చేరింది. ఈ తరుణంలో అక్కడి విలయాన్ని నేరుగా చూసి ఆ విషాద సమయాన్ని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కేరళకు వెళ్లుతున్నారు. మరికొందరు అక్కడి బాధితులను చేదోడు వాదోడుగా ఉండటానికి, సహాయం చేయడానికో వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి డార్క్ టూరిజం కోసం రావొద్దని, అది సహాయక చర్యలను ఆటంక పరుస్తుందని వివరించారు.