IAS Officer: ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్గా పూజా ఖేద్కర్ ఎంపిక రద్దయింది. ఆమె జీవితకాలం యూపీఎస్సీ పరీక్ష రాయకుండా నిషేధం విధించారు. తప్పుడు గుర్తింపుతో ఆమె పరిమితికి మించి యూపీఎస్సీ పరీక్షలు రాసింది. ఆమె దోషిగా తేలడంతో యూపీఎస్సీ ఆమె పై వేటు వేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిబంధనలను ఆమె ఉల్లంఘించినట్టు స్పష్టంగా రుజువు కావడంతో ఆమె ట్రైనీ ఐఏఎస్ ఎంపికను రద్దు చేసింది. జీవితకాలం మళ్లీ యూపీఎస్సీ పరీక్ష రాయకుండా నిషేధం విధించింది.
2022 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ దరఖాస్తులో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని, ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. యూపీఎస్సీ రికార్డులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.
యూపీఎస్సీ పరీక్షలో ఆలిండియా 821 ర్యాంకు సంపాదించిన ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ తన అధికారాలను కూడా దుర్వినియోగం చేసింది. యూపీఎస్సీ అనుమతించిన దాని కంటే కూడా ఎక్కువ సార్లు పరీక్ష రాయడానికి తప్పుడు గుర్తింపు ఇచ్చింది. తన పేరు మార్చుకోవడమే కాదు.. తన పేరెంట్స్ పేర్లు మార్చి, అడ్రెస్, ఇతర వివరాలన్నింటినీ ఆమె మార్చేసింది.
Also Read: కన్యారాశిలో సూర్య-కేతుల కలయిక.. ఈ రాశులవారు చాలా లక్కీ
2009 నుంచి 2023 వరకు అందుబాటులో ఉన్న అభ్యర్థుల వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. పరిమితికి మించి ఎక్కువ సార్లు కేవలం పూజా ఖేద్కర్ మాత్రమే రాసినట్టు గుర్తించారు. ఇలా అన్ని వివరాలను మార్చి ఇచ్చినందునే యూపీఎస్సీ ఈ ఫ్రాడ్ను గుర్తించలేకపోయింది. ఇది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని యూపీఎస్సీ పేర్కొంది.