Morgan Stanley to lay off employees : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలతో బడా కంపెనీల దగ్గరి నుంచి చిన్న సంస్థల దాకా అన్నీ ఉద్యోగుల్ని భారీ సంఖ్యలో తీసేస్తున్నాయి. దాంతో… ఏ క్షణం ఉద్యోగం ఊడిందనే వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ట్విట్టర్ 10 వేలు, మెటా 13 వేలు, అమెజాన్ 10 వేలు, గూగుల్ 10 వేలు, సిస్కో 4 వేలు, హెచ్పీ 6 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇప్పుడీ జాబితాలో మోర్గాన్ స్టాన్లీ కూడా చేరింది.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగుల తొలగింపు మొదలుపెట్టింది. తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో 2 శాతం లేదా దాదాపు 1,600 మంది ఉద్యోగుల తొలగించింది. ఉద్యోగుల్లో కొందర్ని తొలగించబోతున్నామని మోర్గాన్ స్టాన్లీ సీఈవో జేమ్స్ గోర్డాన్ ఇటీవలే చెప్పారు. దానికి తగ్గట్లే కోతలు మొదలుపెట్టారు. గత మూడేళ్లుగా మోర్గాన్ స్టాన్లీ చాలా మంది ఉద్యోగులను నియమించుకుంది. 2020 మొదటి త్రైమాసికం నుంచి ఈ ఏడాది మూడో త్రైమాసికం వరకు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 34 శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీలో 81 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.
మోర్గాన్ స్టాన్లీ ప్రత్యర్థి గోల్డ్మన్ శాక్స్ సహా సిటీ గ్రూప్, బార్క్లేస్ తదితర పెట్టుబడి సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు లక్షా 37 వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాయని ఓ సంస్థ తన నివేదికలో తెలిపింది. అదే కొవిడ్ మొదలైనప్పటి నుంచి చూసుకుంటే… ఈ సంఖ్య ఏకంగా 2 లక్షల 33 వేలు అని ఆ సంస్థ షాకింగ్ విషయం బయటపెట్టింది. కొవిడ్ దెబ్బకు కుదేలైపోయామని నిన్న మొన్నటి దాకా కోతలు పెట్టిన సంస్థలన్నీ, ఇప్పుడు ఆర్థిక మాంద్యం సాకుతో ఉద్యోగుల్ని ఇష్టానుసారం పీకేస్తున్నాయని తెలిపింది.