Telangana Tejasri Drowned In Sarayu River: అయోధ్య యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరయూ నదిలో స్నానానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ బాలిక గల్లంతు అయింది. పుణ్య స్నానం చేస్తున్న సమయంలో వరద ప్రవాహం పెరగింది. దీంతో జనగామ జిల్లా చెందిన తాళ్లపెల్లి తేజశ్రీ(17) కొట్టుకుపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ పట్టణంలోని గీతానగర్ ప్రాంతానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య యాత్రకు వెళ్లారు. మొత్తం 8 మంది బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి ఈనెల 28న బాలరాముడి దర్శనానికి వెళ్లారు. రాముడిని దర్శించుకున్న అనంతరం సరయూ నదికి వద్ద లక్ష్మణ్ ఖిల్లా ఘాట్ వద్ద కాసేపు సేద తీరారు. అనంతరం సెల్ఫీలు దిగుతున్న సమయంలో తేజశ్రీతోపాటు మరో నలుగురు యువతులు నదిలోకి దిగారు. ఎగువ ప్రాంతంలో ఉన్న నేపాల్ డ్యాం నుంచి నీటిని వదలడంతో వరద ప్రవాహం పెరిగింది.
Also Read: వయనాడ్ లో గంటగంటకూ పెరుగుతున్న మరణాలు.. 143కి చేరిన మృతులు
అయితే, ఐదుగురు యువతులు నదిలో కొట్టుకుపోవడంతో బంధువులు కేకలు వేశారు. వెంటనే రెస్క్యూ టీం నదిలోకి దూకి నలుగురిని కాపాడారు. కానీ తేజశ్రీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదని బాధిత తండ్రి నాగరాజు చెప్పాడు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..అధికారులతో ఫోన్ మాట్లాడారు. యూపీ సీఎంతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికీ బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరుమున్నీరుగా నాగరాజు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.