Pithapuram Dorababu Ready to Leave YSRCP : పిఠాపురం సార్వత్రిక ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన అసెంబ్లీ నియోజకవర్గం.. జనసేనాని పవన్కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయడంతో అప్పటి అధికార వైసీపీ ఆ సెగ్మెంట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలతో పాటు.. జగన్ కోటరీలోని వారు కూడా పవన్ని ఓడించడమే లక్ష్యంగా చేయాల్సినవన్నీ చేశారు . అయినా జనసేనాని అఖండ విజయం సాధించారు. దాంతో పిఠాపురంలో ఢీలా పడిపోయి వైసీపీకి ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలబోతుందంట. అక్కడ సిట్టింగు ఎమ్మెల్యే దొరబాబుని మార్చి తనదైన ప్రయోగం చేసిన జగన్కి.. ఇప్పుడా దొరబాబు ఝలక్ ఇవ్వబోతున్నారంట.
మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తెగ చెలరేగిపోయింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుని, పిఠాపురంలో జనసనాని పవన్కళ్యాణ్ని ఓడించబోతున్నామని తెగ హడావుడి చేసింది. అసలు పవన్కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని సవాళ్లు చేశారు ఆ పార్టీ నేతలు.. అందులో భాగంగా పిఠాపురంలో నిర్ణయాత్మకంగా ఉన్న కాపు నియోజకవర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా పాట్లు పడ్డారు.
ఎన్నికల ప్రచారంలో వరాహి యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లినప్పుడు అప్పటి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. కాకినాడలో అయిదేళ్ల పాటు ద్వారంపూడి, ఆయన అనుచరులు పాల్పడిన అవినీతి అక్రమాల అంతు తేలుస్తామని ప్రకటించారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా సీఎంగా వ్యవహరిస్తున్న ద్వారంపూడి పిఠాపురంలో పవన్ను ఓడించడానికి గట్టిగానే పావులు కదిపారు. పొలిటికల్గా ఎక్స్పైర్ అయిపోయిన కాపు నేత ముద్రగడ పద్మనాభంతో కలిసి పిఠాపురంలోనే తిష్ట వేసి.. వంగా గీత విజయానికి తెగ కష్టపడ్డారు.
Also Read : నువ్వు వేస్ట్.. నాన్నపేరు చెడగొడుతున్నావ్
సీన్ కట్ చేస్తే పిఠాపురంలో సంచలన విజయం సాధించిన పవన్కళ్యాణ్ వైసీపీకి తన స్టామినా ఏంటో చూపించారు. ఏకంగా 70 వేలకుపైగా మెజారిటీతో వంగా గీతపై గెలుపొంది పిఠాపరంలో జనసేన జెండా ఎగరేశారు. ఆ ఎఫెక్ట్తో కాపునేతగా గుర్తింపు ఉండి.. వైసీపీలో చేరి కాపుల్లో ఉన్న కాస్త ఇమేజ్ కూడా పోగొట్టుకున్న ముద్రగడ ఇప్పుడు ముద్రగడ పద్మానాభరెడ్డిగా మారిపోవాల్సి వచ్చింది.. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ .. ప్రచార సమయంలో ప్రకటించినట్లు కాకినాడలో ఆపరేషన్ ద్వారంపూడి కూడా మొదలుపెట్టించారు.
అదలాఉంటే పోలింగ్ నాటికే పిఠాపురంలో వైసీపీ పరాజయం కన్ఫర్మ్ అయినట్లు కనిపించింది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును పక్కనపెట్టిన జగన్.. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీకి పెట్టారు. పిఠాపురంలో దొరబాబు రాజకీయ ప్రస్థానం ఘనంగానే సాగింది. 2004లో మొదటి సారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2014లో టీడీపీ అభ్యర్ధి వర్మ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.
పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి ఎంత పట్టు ఉందో దొరబాబుకు కూడా అంతే బలం ఉందంటారు. అలాంటి దొరబాబు మొన్నటి ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో.. అప్పటి నుంచే వైసీసీతో గ్యాప్ మెయిన్టెయిన్ చేస్తున్నారు. అప్పట్లోనే ఆయన జనసేన వైపు చూసారన్న టాక్ నడిచింది. అయితే వైసిపి పెద్దలు పిలిచి జిల్లా వైసీపీ అధ్యక్షుడు పదవి లేక సముచిత స్థానం ఇస్తామని వంగా గీతకు సపోర్ట్ చేయాలని బుజ్జగించారు.
Also Read : పవన్ కల్యాణ్కు భారీ ఊరట..
అయితే ఎన్నికల సమయంలో పిఠాపురంలో పెత్తనమంతా ద్వారంపూడి, ముద్రగడలదే నడిచింది. దాంతో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని.. కనీస కార్యకర్తగా కూడా చూడలేదని దొరబాబు అసంతృప్తితో ఉన్నారంట.. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ సీన్ రివర్స్ అవ్వడంతో వైసీపీ అధ్యక్షుడు జగనే బెంగళూరు ప్యాలెస్కు వెళ్లిపోతున్నారు. ఆ క్రమంలో ఇక పార్టీలో ఉన్నా ప్రయోజనం ఏం ఉండదని దొరబాబు వైసిపికి గుడ్ బై చెప్పడానికి ఫిక్స్ అయ్యారంట.
పదవి ఆశించకుండా జనసేన పార్టీ లో చేరబోతున్నారని దొరబాబు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల ఫలితాలు తర్వాత వైసీపీ కార్యక్రమాలకు పెండెం దొరబాబు దూరంగా ఉంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకే కాదు. ఇటీవల ఢిల్లీలో జగన్ తలపెట్టిన ధర్నాకు కూడా డుమ్మాకొట్టారు. ఆ క్రమంలో పిఠాపురంలో వంగా గీతను బరిలోకి దింపి చేతులు కాల్చుకున్న వైసీపీకి దొరబాబు బిగ్ షాక ఇవ్వబోతున్నారంట. జనసేన నేతలతో చర్చలు జరుపుతున్న దొరబాబు నేడోరేపో ఆ లాంఛనం పూర్తి చేస్తారంటున్నారు. ఆ లాంఛనం పూర్తైతే పిఠాపురంలో లీడరే కాదు కేడర్ కూడా లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.