BRS Party: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి చేరుతారనే వార్తలు గుప్పమన్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సహా పలువురు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారని గులాబీ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ, అవన్ని అవాస్తవ కథనాలని స్వయంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీడియాతో చిట్చాట్లో స్పష్టం చేశారు. ఆ దుష్ప్రచారాన్ని ఖండించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, ఇదంతా వట్టి అవాస్తవ ప్రచారమేనని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖమ్మం నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెల్లం వెంకట్రావు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. అది కేవలం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం అని ఖండించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎక్కడికీ పోరని పేర్కొన్నారు. అయితే, గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, పాత పరిచయాలు ఉంటాయని వివరించారు. అంతే తప్పితే తెల్లం వెంకట్రావు పార్టీ మారే ఛాన్సే లేదని తేల్చి చెప్పేశారు.
Also Read: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. ఖండించిన భద్రాచలం ఎమ్మెల్యే
తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎలాంటి ఇబ్బంది కలుగదని, తమ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కడికి పోరని విశ్వాసంగా చెప్పారు. వారికి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటామని వివరించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ అంశంపై స్పందించారు. తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కడికీ పోరని, అదంతా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవాస్తవ ప్రచారమేనని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్లీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు