Landslides: కేరళలో వర్షం విలయం సృష్టిస్తున్నది. వయానాడ్ జిల్లాలో మెప్పడి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మంగళవారం ఉదయం నాలుగు గంటల వ్యవధిలోనే మూడు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విలయం కారణంగా 106 మంది ఇప్పటికే మరణించారు. కనీసం 128 మంది గాయాలపాలయ్యరు. మరికొందరు కొండచరియల కింద చిక్కుకుని ఉండవచ్చుని అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహా పలు ఏజెన్సీలు సహాయక చర్యల్లో మునిగిపోయాయి. ముండక్కై, చూరల్మల, అట్టామల, నూల్పూజ గ్రామాలు కొండచరియల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. ఎడతెరిపి లేని వాన, గాలులు, కొండ చరియల విరిగిపడటంతో చాలా చోట్ల చెట్లు కూకటి వేళ్లతో పెకిలించుకువచ్చాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న చలియార్ నది కూడా ఉగ్రరూపం దాల్చడంతో చాలా మంది అందులో కొట్టుకుపోయారనీ చెబుతున్నారు.
కొండచరియల వల్ల తీవ్రంగా నష్టపోయిన గ్రామాలను కలిపే బ్రిడ్జీ కూడా కూలిపోయింది. దారులు కూడా ధ్వంసం కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఈ సహాయక చర్యల్లో ఉన్నాయి. ఆర్మీ నుంచి 225 మంది జవాన్లు రెస్క్యూ టీమ్లో ఉన్నారు.
హృదయాన్ని కలిచేవేసే విలయం చోటుచేసుకుందని, అక్కడి ఊర్లు మొత్తంగా కొండచరియల్లో కొట్టుకుపోయాయని సీఎం పినరయి విజయన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో బాధపడ్డారు. రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించామని చెప్పారు. వయానాడ్లో భీకర వర్షం కురుస్తున్నదని, చాలా ఊర్లు కొట్టుకుపోయాయని వివరించారు. చాలా మందికి గత రాత్రి నిద్ర.. శాశ్వత నిద్రగా మారిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితులను పర్యవేక్షించడానికి ఐదుగురు మంత్రులు పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారని వివరించారు. క్షతగాత్రులను అన్ని రకాల సహాయం చేయడానికి, వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకున్నామని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బ్రిడ్జీ కూలిపోవడంతో ఆ ఏరియాకు రాకపోకలు ఇబ్బందిగా మారాయని, అయితే, తాము తిరిగి కనెక్టివిటీ చేయగలిగామని, హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపామని, కానీ, వాతావరణం అనుకూలించడం లేదని వివరించారు. చాలా కుటుంబాలు తమ బంధువుల ఊళ్లకు తరలివెళ్లిపోయాయని చెబుతున్నారు.
Also Read: రక్షాబంధన్ ఆఫర్స్.. సగం ధరకే స్మార్ట్ఫోన్లు.. గిఫ్గ్గా ఇచ్చేయండి!
పరిహారాన్ని ప్రకటించిన ప్రధాని
ఈ ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల పరిహారాన్ని ప్రకటించారు. తాను కేరళ సీఎం పినరయి విజయన్తో మాట్లాడినట్టు తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు ట్వీట్ చేశారు.
వయానాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ తాను స్థానిక కలెక్టర్, అధికారులను సంప్రదించానని, అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారని వివరించారు. బాధితులకు అండగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. తమ వైపు నుంచి అవసరమైన సహాయాన్ని సంపూర్ణంగా అందిస్తామని వివరించారు. వయానాడ్కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లే అవకాశం ఉన్నదని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Also Read: ‘మా’ ప్రెసిడెంట్ పై మీనా ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా.. ?
8 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఒక వైపు వయానాడ్లో విలయం తాండవిస్తుండగా కేరళలో ఇంకా భీకర వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదుక్కి, త్రిస్సూర్, పాలక్కడ్, మలప్పురం, కోళికోడ్, వయానాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఈ అలర్ట్ జారీ చేయగా.. నాలుగు జిల్లాలు పథానంతిట్ట, అలప్పూజా, కొట్టాయం, ఎర్నాకుల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.