HimachalPradesh : హిమాచల్ ప్రదేశ్ హస్తగతమైంది.హోరాహోరీ పోరు సాగిన చివరికి కాంగ్రెస్సే పైచేయి సాధించింది. దీంతో వరుసగా రెండోసారి అధికారం సాధించాలన్న బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లో 1998 నుంచి కాంగ్రెస్ -బీజేపీల మధ్య అధికారం మారుతోంది. 1998లో రెండు పార్టీలు సమానంగా సీట్లు సాధించినా అప్పుడు ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టింది. 2003 ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2007 ఎన్నికల్లో మళ్లీ కమలం వికశించింది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం దక్కింది. 2017 ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారం చేపట్టింది. ఇలా గత 24 ఏళ్లుగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ -బీజేపీల మధ్య అధికారం మారుతోంది. అధికారం పార్టీ ఓడిపోవడం ఇక్కడ అనవాయితీగా మారింది. తాజా ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది.
హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ సాధించడంతో కాంగ్రెస్ అధికారం చేపట్టడం లాంఛనమే. మేజిక్ ఫిగర్ కంటే 5 సీట్లు మాత్రమే ఎక్కువ రావడంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రిసార్టు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ కమలం ప్రయత్నాలను అడ్డుకునేందుకు కొత్త ఎమ్మెల్యేలను తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బస్సుల్లో రాజస్థాన్ తరలించేందుకు హస్తం పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించారని తెలుస్తోంది. హిమాచల్ పరిస్థితులను ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ కు 40 స్థానాలు దక్కడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. బీజేపీ 25 స్థానాల్లో గెలిచి ప్రతిపక్షానికే పరిమితమైంది.