MLA Tellam Venkatrao: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు. తాను ప్రశాంత్ రెడ్డిని కలిసి కేటీఆర్తో సమావేశమై పార్టీ మార్పు గురించి చర్చించినట్టు దుష్ప్రచారం జరుగుతున్నదని, అది పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీకి వెళ్లిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు టీ బ్రేక్లో బయటికి వస్తుండగా లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. వారు ప్రతిపక్ష నేత లాబీలోకి తీసుకెళ్లారని వివరించారు. అంతకు మించి అక్కడ పార్టీ మార్పు గురించి ఎలాంటి చర్చ రాలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతను కలిసినప్పటి ఫొటోలు, వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఈ దుష్ప్రచారాన్ని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ వార్తలను ఎవరూ విశ్వసించరాదని తెలిపారు. తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లడమంటే ఆత్మహత్య చేసుకున్నట్టేనని పేర్కొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పారు. భద్రాచలం అభివృద్ధి కాంక్షించే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వివరించారు.
ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు.
కాంగ్రెస్లో చేరిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి తమ పార్టీలోకి వస్తున్నారని గులాబీ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరినట్టు ప్రకటించారని కూడా పేర్కొన్నారు. ఇక తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో వాస్తవం లేదని తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది.
Also Read: Meena Sagar: ‘మా’ ప్రెసిడెంట్ పై మీనా ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా.. ?
ఫిరాయింపుల పిటిషన్ పై విచారణ వాయిదా
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని, ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.